పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మూడు శతకాలు సాధిస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా.. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి ఈ సిరీస్లో శుభారంభం చేసింది.
అయితే ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. మోకాలి గాయంతో అతను ఈ మ్యాచ్ ఆడలేదు. అతని స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం జరిగే రెండో వన్డేలో కోహ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. కోహ్లీ రాకతో జైస్వాల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక కోహ్లీ గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు.

అతనితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేకపోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ ఇద్దరి వైఫల్యం ఆందోళనకు గురి చేస్తోంది. సురేశ్ రైనా మాత్రం కోహ్లీ మూడు శతకాలతో చెలరేగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. మరో నాలుగేళ్ల పాటు అతను అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని చెప్పాడు.
'ఆటగాడిగా విరాట్ కోహ్లీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అతను మరో నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. వన్డే క్రికెట్లో అతను నిలకడగా ఆడుతాడు. అతని ఈ ఫార్మాట్ ఆడటం చాలా ఇష్టం.
ఐసీసీ టోర్నీల్లోని నాకౌట్ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ అతను ఆడిన ఇన్నింగ్స్ను ఎవరూ మర్చిపోలేరు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మూడు శతకాలు సాధిస్తాడని నేను భావిస్తున్నా.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. 23న పాకిస్థాన్తో, మార్చి 2న న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే నిర్వహించనున్నారు.