
న్యూఢిల్లీ: సీనియర్ క్రికెటర్ల పట్ల సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా సినీయర్ క్రికెటర్ సురేష్ రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించాడు. భారత జట్టులో చోటు దక్కాలంటే యో-యో ఫిట్నెస్ టెస్ట్లో పాస్ కావడం తప్పని సరని, అందులో నెగ్గినా టీమ్లో చోటు దక్కడం లేదని ఈ మిడిలార్డర్ బ్యాట్స్మన్ వాపోయాడు. ఆజ్తక్ చానెల్కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. ఓ సీనియర్ ప్లేయర్ను జట్టు నుంచి తొలిగిస్తే దానికి కారణం చెప్పాలన్నాడు.
'సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలెక్టర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఈ రోజు అవకాశం వచ్చింది.. బాగా ఆడావు.. ఇంటికెళ్లావు. కానీ, తర్వాతి మ్యాచ్లో ఆడే అవకాశం రాకపోతే.. ఎందుకు అనే కారణం అతడికి తెలియాలి. ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపండి. వాటిని సరిదిద్దుకుంటాం. ఏమీ చెప్పకపోతే ఎలా అర్ధం చేసుకోవాలి. ఏలా మెరుగవ్వాలి'అని రైనా ప్రశ్నించాడు.
గతేడాది ఆస్టులో మోకాలి సర్జరీ చేయించుకున్న రైనా.. తన ఆటలో మెరుగుదల కనబరుస్తున్నాడు. ఇక 2018 జూలై నుంచి భారత తరఫున బరిలోకి దిగని ఈ మిడిలార్డర్ బ్యాట్స్మన్, ఎట్టి పరిస్థితుల్లో రీఎంట్రీ కోసం చేసే ప్రయత్నాలను ఆపనన్నాడు.
'రంజీ ట్రోఫీలో ఆడితే మన ఆటను ఎవరూ చూడరు. అందుకే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా. అక్కడ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోవచ్చు. ఐపీఎల్లో ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. టీ20 గేమ్ అంత సులువు కాదు. కనీసం ఆలోచించడానికి కూడా సమయం ఉండదు. ఎదైనా ఎదురు దెబ్బతగిలినా.. కోలుకోవడానికి కూడా టైమ్ ఉండదు'అని రైనా చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, అతని వయసు అయిపోలేదని ఇటీవల రైనా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్కు ముందు ఈ సీజన్ ఐపీఎల్ కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో ధోనీ బ్యాటింగ్ పదును తాను చూశానని ఈ చెన్నై బ్యాట్స్మన్ తెలిపాడు. అతను కొట్టిన భారీ సిక్సర్లే ధోనీ ఎంత ఫిట్గా ఉన్నాడో తెలియజేశాయన్నాడు.