టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే విషయంలో రోహిత్ శర్మ మరో ధోనీని తలపిస్తున్నాడని కొనియాడాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.
విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ వంటి అరంగేట్ర ప్లేయర్లతో టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీని సురేశ్ రైనా కొనియాడాడు. ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మరో ధోనీ అంటూ కితాబిచ్చాడు.

'టీమిండియాలో రోహిత్ శర్మ మరో ధోనీ. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ధోనీలానే యువకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ధోనీ సారథ్యంలో నేను చాలా క్రికెట్ ఆడాను. ధోనీలానే రోహిత్ కూడా సరైన దిశలో జట్టును నడిపిస్తున్నాడు. అతనో అద్భుతమైన సారథి. ధ్రువ్ జురెల్తో కలిసి నేను ఉత్తప్రదేశ్కు ఆడాను. అతని సక్సెస్కు ప్రధాన కారణం రోహిత్ శర్మ.
అతను ముందుగా సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇస్తూ.. ధ్రువ్ జురెల్ను జట్టులో భాగం చేశాడు. జురెల్ అసాధారణ ఆటగాడు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదే జోరును కొనసాగిస్తూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ ఎంతో విలువైనది.
ఎందుకంటే టర్నింగ్ వికెట్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. కానీ అతను చాలా ప్రశాంతంగా ఉంటూ సునాయసంగా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపింగ్లోనూ ఆకట్టుకున్నాడు. ఆర్మీ కుటుంబానికి చెందినవాడు కావడంతో ఫియర్లెస్ అటిట్యూడ్ కలిగి ఉన్నాడు. నెట్స్లో కూడా తీవ్రంగా కష్టపడుతాడు. అతన్ని నేను చాలా దగ్గరగా చూశాను.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.