పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంపై ఫోకస్ పెట్టాలని టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. గతం గతః అని ఇకనైనా బాధ్యతగా ఆడటం అలవర్చుకోవాలన్నాడు. అలా కాకుండా దూకుడుగా ఆడటమే తన సహజ శైలి అంటే కుదురదని, జట్టులో చోటు కూడా ఉండదని రైనా హెచ్చరించాడు.
రిషభ్ పంత్ ప్రతిభావంతమైన ఆటగాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజులో నిల్చుంటే ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించగలడు. తనదైన విధ్వంసంతో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. కానీ రిషభ్ పంత్ ఓపికగా ఆడలేడు. మ్యాచ్ పరిస్థితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యపు షాట్స్ ఆడుతూ వికెట్ పారేసుకుంటాడు. ఇది అతని ప్రధాన బలహీనత.

ఇది సరిచేసుకుంటేనే రిషభ్ పంత్ సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగుతాడని లేదంటే అంతే వేగంగా కనుమరుగవుతాడని సురేశ్ రైనా హెచ్చరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ రిషభ్ పంత్కు మంచి అవకాశమని చెప్పాడు. ఈ సిరీస్ను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.
'రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చాలా మెరుగైంది. ఇది ఆనందపడే విషయం. కాకపోతే అతను బ్యాటింగే మరింత బాధ్యతగా చేయాలి. ఎందుకంటే అతను ఇప్పుడు ఆడబోయేది 50 ఓవర్ల టోర్నీ. కనీసం 40 నుంచి 50 బంతులను ఆడేలా ఉండాలి. యశస్వి జైస్వాల్ టాపార్డర్లో ఆడకపోతే.. రిషభ్ పంత్ జట్టుకు కీలకమవుతాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం పంత్ను నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు పంపవచ్చు. ఎందుకంటే పంత్ మ్యాచ్ను త్వరగా ముగించగలడు.
'నేను 50 బంతులు ఆడితే 80 నుంచి 100 పరుగులు చేయగలను'అని తనకు తానుగా చెప్పుకోవాలి. ఆ ప్రతిభ, సామర్థ్యం అతనిలో ఉన్నాయి. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఓపికగా ఆడటమే కావాలి.'అని సురేశ్ రైనా ఓ స్పోర్ట్స్ ఛానెల్ షోలో చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరగనుండగా.. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్తో పంత్కు పోటీ నెలకొంది.