
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డేవిల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ మాథ్యూ హెడన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే ఐపీఎల్లో తన ఫేవరెట్ మూమెంట్ అని టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. స్టార్ క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు.
ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబసభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా క్రికెట్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. కొవిడ్-19 కారణంగా ఐపీఎల్ నిర్వహణ కష్టంగా మారింది. దీంతో ఐపీఎల్ ప్లేయర్లంతా సోషల్ మీడియా వేదికగా చిట్చాట్ చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ ఏంటో చెప్పాలని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ హెడెన్ #MyIPLmoment అనే హ్యాష్ ట్యాగ్తో ట్విటర్ వేదికగా రైనాను ప్రశ్నించాడు.
దీనిపై స్పందించిన రైనా.. ఐపీఎల్లో తనకు నచ్చిన ఇన్నింగ్స్ గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు. 2010లో ఢిల్లీ డేర్డెవిల్స్( ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుపై హేడెన్ 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ తన ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్ అని రైనా తెలిపాడు.
'ఢిల్లీ డేర్డేవిల్స్ పై నువ్వు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్.. ఐపీఎల్లో నా ఫెవరేట్ మూమెంట్. మంగూస్ బ్యాట్తో 93 పరుగులు చేశావ్. ప్రతీ బంతి మైదానం బయటే పడింది. ప్రతీకూలంగా ఉన్న ఆ పిచ్పై అద్భుత ప్రదర్శన కనబర్చావ్. ఆ మ్యాచ్లో ఢిల్లీ కూడా అద్భుతంగా ఆడింది. 190 లేక 185 పరుగులో చేశారనుకుంటా. భారీ స్కోర్ చేజింగ్లో నీ బ్యాటింగ్ అద్భుతం. మనమిద్దరం మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ మ్యాచ్లో నేను 49 పరుగులు చేశాను.
నేనే కెప్టెన్ కూడా. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా గెలుస్తామనే నమ్మకాన్ని కలిగించావు. నీ తరఫున అది అద్బుతమైన ప్రదర్శన. నువ్వు.. సంతకం చేసి ఇచ్చిన బ్యాట్ ఇంకా నా దగ్గర ఉంది. ఆ విషయం గుర్తుండే ఉంటుందనుకుంటున్నా.'అని రైనా తెలిపాడు. ఆ మ్యాచ్లో మంగూస్ బ్యాట్ను ఉపయోగించిన హేడెన్ 43 బంతుల్లో 7 సిక్సర్లు, 9 ఫోర్లతో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.