
సీఎస్కేతోనే ఉంటా..
ఇక బుధవారంతో 40వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అనుకుంటున్న తరుణంలో రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూస్ 24 స్పోర్ట్స్ చానెల్తో మాట్లాడుతూ.. 'నాకింకా మరో నాలుగు, ఐదేళ్లు ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్ ఐపీఎల్ కూడా మేం ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా రాబోతున్నాయి. కానీ క్రికెటర్గా చివరి క్షణం వరకు నేను సీఎస్కేతోనే ఉండాలనుకుంటున్నా. ఈ ఏడాది మేం అద్భుతంగా రాణిస్తామని ఆశిస్తున్నా.

ధోనీ ఆడకుంటే..
ధోనీ భాయ్ వచ్చే ఏడాది ఆడకుంటే.. నేను కూడా తప్పుకుంటా. మేమిద్దరం కలిసి 2008 నుంచి సీఎస్కేకు ఆడుతున్నాం. ఒక వేళ మేం ఈ ఏడాది టైటిల్ గెలిస్తే వచ్చే సీజన్ ఆడేలా ధోనీ భాయ్ని ఒప్పిస్తా. నా సాయశక్తుల మేర నేను ప్రయత్నిస్తా. ఒకవేళ అతను ఆడకుంటే మాత్రం నేను కూడా ఏ ఐపిఎల్ జట్టుకైనా ఆడతానని అనుకోను.' అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి ధోనీ, రైనా చెన్నైకి ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఆ జట్టుకు రెండు పిల్లర్స్ లాంటి వారు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించారు.

‘నీ దారిలోనే నడుస్తా’..
గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ధోనీ, సురేశ్ రైనా క్రికెట్ అభిమానులకు ఊహించని షాకిచ్చారు. అనూహ్యంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. క్షణాల వ్యవధిలో 'నీ దారిలోనే నడుస్తా' అంటూ సురేశ్ రైనా వీడ్కోలు పలికాడు. 'కెరీర్ అసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ధోనీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా... ధోనీతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పిన సురేష్ రైనా ధోనీ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండదలచుకున్నానని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

నా గైడ్ నువ్వే..
బుధవారం 40వ పుట్టిన రోజు జరుపుకున్న ధోనీకి రైనా తనదైన శైలిలో ఓ వీడియో ద్వారా విషెస్ చెప్పాడు. 'ఎంఎస్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు మిత్రుడు, సోదరుడు, మార్గనిర్దేశకుడు. మీ నుంచి అందరూ కోరుకునేది ఇదే. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప ఆటగాడిగా, నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు' అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












