అప్కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చివరిదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. ఈ టోర్నీలో అతను చెలరేగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్ తరహాలోనే రోహిత్ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీ తర్వాత రోహిత్ బ్యాటర్గా దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్గానూ ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. గతేడాది భారత్ ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడగా.. అందులోనూ ఓటమిపాలైంది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. అనంతరం టెస్ట్ ఫార్మాట్లో అనూహ్య పరాజయాలను ఎదుర్కొంది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ రెండు సిరీస్ల్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతని ఫామ్పై ఆందోళన నెలకొంది.

తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన సురేశ్ రైనా.. రోహిత్ చెలరేగుతాడని చెప్పాడు. కెరీర్లో అతనికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ అని చెప్పాడు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ రాణిస్తాడని అనుకుంటున్నా. వన్డే ప్రపంచకప్ 2023 తరహాలోనే దూకుడుగా ఆడుతాడు. అతనితో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది చూడాలి. శుభ్మన్ గిల్ ఆడుతాడా? లేక యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడా? అనేది తెలియాలి. ఏవరు వచ్చిన ఓపెనర్గా రోహిత్ అదిరిపోయే ఆరంభాలు అందిస్తాడు.
కెప్టెన్గా అతనికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ. ఈ టోర్నీలో భారత్ గెలిస్తే అతని ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఈ టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే అతను బ్యాటింగ్తో రాణించడం కీలకం.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లలో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ 2024 అందించాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా.. భారత్ ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్తో తలపడనుంది.