
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్తో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే భారత్కు వచ్చానని ఆ జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం కూడా ఉందని హింట్ ఇచ్చాడు. మరోవైపు జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా రైనా రీఎంట్రీని ధోనీ డిసైడ్ చేస్తాడని తెలిపాడు.
అయినా సురేశ్ రైనా, సీఎస్కే వ్యవహారం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా జట్టు వాట్సాప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించారనే వార్త హల్చల్ చేస్తోంది. జట్టును వీడిన వెంటనే రైనాను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినట్లు ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపాడని ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. అంతేకాకుండా రైనా టీమ్మెనేజ్మెంట్కు క్షమాపణలు కూడా చెప్పాడని, రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.
'రైనా జట్టును వీడగానే... చెన్నై సూపర్ కింగ్స్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం జరిగింది. అతను సీఈవో, ధోనీ, కోచ్ ఫ్లేమింగ్తో కూడిన టీమ్మేనేజ్మెంట్ను సంప్రదించాడు. తన అనాలోచిత నిర్ణయంపై క్షమాపణలు కోరాడు. పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు.'అని సదరు అధికారి పేర్కొన్నారు.
దుబాయ్లో చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ను కరోనా చుట్టుముట్టడంతో రైనాకు కుటుంబంపై బెంగ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్, యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్తో సహా 11 మంది సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో రైనా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీనికి తోడు పంజాబ్లో తన మేనమామ దారుణ హత్యకు గురవ్వడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదనిపించి భారత్కు వచ్చానని రైనా బుధవారం క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అయితే హోటల్ గది వ్యవహారంలో చెన్నై మేనేజ్మెంట్తో రైనాకు బేధాభిప్రాయాలు తలెత్తాయనే ప్రచారం కూడా జరిగింది.
అదే సమయంలో రైనా నిష్క్రమణపై శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. జట్టుపై ఆగ్రహంతోనే రైనా ఐపీఎల్ను వీడాడనే పుకార్లు హల్చల్ చేశాయి. తన నిష్క్రమణకు అసలు కారణం తెలియకనే శ్రీనివాసన్ అలా మాట్లాడడని, ఎవరూ కూడా బలమైన కారణం లేకుండా రూ.12.5 కోట్లను వదులుకోరని రైనా చెప్పుకొచ్చాడు. ఇక శ్రీనివాసన్ కూడా రైనా తన కొడుకులాంటి వాడని, అయితే అతని రీఎంట్రీ తన చేతుల్లో లేదన్నాడు. ధోనీనే డిసైడ్ చేస్తాడని చెప్పాడు. ప్రస్తుతానికైతే చెన్నై.. రైనా స్థానంలో ఎవరిని తీసుకోలేదు. ఇప్పుడున్న జట్టుపై కోచ్, ధోనీ నమ్మకంగా ఉన్నారని, మరొకరు అవసరంలేదంటున్నారని జట్టు సీఈవో తెలిపారు.