
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తొలిసారి చూసినప్పుడు, అతని పొడవాటి జుట్టును చూసి అతనేం ఆడుతాడని సందేహించామని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. మ్యాచ్ బరిలోకి దిగగా.. ధోనీ తమకు చుక్కలు చూపించాడని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో జియో సినిమా కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సురేశ్ రైనా.. లీగ్కు సంబంధించిన షోలో ధోనీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
టీమిండియా, సీఎస్కే జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు ధోనీ, సురేశ్ రైనా క్రికెట్ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన రైనా సెంట్రల్ జోన్ నుంచి జార్ఖండ్కు చెందిన ధోనీ ఈస్ట్ జోన్ నుంచి 2005లో దులీప్ ట్రోఫీలో తొలిసారి తలపడ్డారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనను రైనా గుర్తు చేసుకున్నాడు. 'పొడవాటి జుట్టున్న జార్ఖండ్ ఆటగాడు నిలకడగా భారీ సిక్సులు బాదుతాడని ధోనీ గురించి మేం చాలా విన్నాం. అవి మైదానం ధాటి పోతాయని అందరూ గొప్పగా చెప్పేవారు. ఓ రోజు ధోనీ ప్రశాంతంగా ఓ మూలకు కూర్చొని రోటీ, బటర్ చికెన్ తింటున్నాడు.
అతనికి సమీపంలోనే మా జట్టు ఉంది. ధోనీని చూసి మాజీ క్రికెటర్ జ్ఞానేంద్ర పాండే 'అతను మనల్ని ఇబ్బంది పెడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చాలా ప్రశాంతంగా తన తిండిని ఎంజాయ్ చేస్తున్నాడు' అని వ్యంగ్యంగా మాట్లాడాడు. కానీ తర్వాతి రోజు మ్యాచ్ మొదలవ్వగానే ధోనీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆకాశాన్ని ముద్దాడే సిక్స్లు బాదాడు. దీంతో జ్ఞాను భాయ్ తన మాటల్ని వెనక్కి తీసుకోవల్సి వచ్చింది.'' అని తెలిపాడు.
2010 ఐపీఎల్లో ధర్మశాలలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగన మ్యాచ్లో ధోనీ బాదిన అరుదైన సిక్స్ను రైనా గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో ధోనీ హెల్మెట్ పంచ్ అయ్యేలా మరో షాట్ కొట్టాడని చెప్పాడు. 'లాంగ్ ఆన్లో ధోనీ భారీ షాట్ బాదాడు. ఇదివరకు ఏ సందర్భంలోనూ, మ్యాచ్లోనూ అతను అలా కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. అతను కెప్టెన్ కూల్ అని అందరికీ తెలుసు. కానీ మ్యాచ్ పరిస్థితిని బట్టి అతడు తన ఎనర్జీని ప్రదర్శించేవాడు'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.