పాకిస్థాన్తో అయిష్టంగానే భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడారని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. బీసీసీఐ ఒత్తిడి మేరకే తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగారని తెలిపాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో తలపడిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ను బాయ్కట్ చేయాలని మేజార్టీ భారతీయులు పిలుపునిచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాక్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని భారతీయులు కోరుకుంటున్నారు. కానీ ఐసీసీ, ఏసీసీ రూల్స్ ప్రకారం పాకిస్థాన్తో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీసీసీఐ వివరణ ఇచ్చింది. అయినా వినని అభిమానులు ఈ మ్యాచ్ పట్టించుకోలేదు.
అభిమానుల నిరసనల మధ్యే పాక్తో ఆడిన భారత్ అసాధారణ విజయాన్నందుకుంది. ఈ విజయానంతరం పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. అంతేకాకుండా ఈ విజయాన్ని భారత సాయుద దళాలకు అంకితమిస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు. పహల్గామ్ ఉగ్ర దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి సానుభూతిని తెలియజేస్తున్నామని వెల్లడించాడు. తప్పని పరిస్థితుల్లోనే ఈ మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని అభిమానులకు పరోక్షంగా సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు భారత జట్టుకు ఈ మ్యాచ్ ఆడే ఇష్టమే లేదని చెప్పాడు. 'పాక్తో మ్యాచ్ ఆడాలని భారత ఆటగాళ్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. మీరు మన ఆటగాళ్లను వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను అడిగితే ఇదే విషయం చెబుతారు. ఆసియా కప్లో పాక్తో ఆడాలని ఉందా? లేదా? అనే ప్రశ్నకు అందరూ లేదనే బదులిస్తారు. బీసీసీఐ ఒత్తిడి వల్లే ఈ మ్యాచ్ ఆడేందుకు వారు అంగీకరించారు. పాక్తో ఆడటం నన్ను బాధించింది. విజయం సాధించడం ఆనందమే కానీ.. అసలు ఆడకుండా ఉండుంటే ఇంకా బాగుండేది.'అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.
వరుసగా రెండు విజయాలతో టీమిండియా సూపర్-4 బెర్త్ను ఖరారు చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ తమ ఆఖరి మ్యాచ్లో యూఏఈపై విజయం సాధిస్తే రెండో జట్టుగా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. అదే జరిగితే మరోసారి భారత్, పాక్ జట్లు తలపడుతాయి. వచ్చే ఆదివారమే(సెప్టెంబర్ 21) ఈ మ్యాచ్ ఉంటుంది. అప్పుడు ఇరు జట్ల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.