
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పనితీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అంబుడ్స్మన్గా జస్టిస్ దీపక్ వర్మ నియామకం విషయంలో జరిగిన రాద్దంతంపై సీబీఐ దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. అవసరమైతే హైకోర్టు మాజీ జడ్జీతో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 6న పక్కన పెట్టింది. దాంతో హెచ్సీఏ, బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ''క్రికెట్ పక్కకు పోయింది. రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసోసియేషన్లో చోటుచేసుకున్న మొత్తం వ్యవహారాలపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తాం. రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటికెళ్లిపోవాలి.
ఈ రాద్దాంతంపై సీబీఐ దర్యాప్తు అవసరమనిపిస్తోంది. వాళ్లు ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారు.'' అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంబుడ్స్మన్గా నియమితులైన జస్టిస్ దీపక్ వర్మ పదవీకాలం ఇప్పటికే ముగిసిపోయినందున ఆయన ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండా చూడాలని హెచ్సీఏలో ఓ గ్రూప్ తరుఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ రాకేష్ ఖన్నాకు కోర్టు సూచించింది. ఈ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తామని, ఆలోపు విచారణకోసం మాజీ న్యాయమూర్తుల పేర్లను ఎంపికచేస్తామని పేర్కొంది..
ఒకప్పుడు హైదరాబాద్ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే హైదరాబాద్. బ్యాటింగ్ మణికట్టు మాయాజాలానికి పెట్టింది పేరు. ఎం.ఎల్.జయసింహ, మహ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్రపంచ మేటి మణికట్టు బ్యాటింగ్ మాంత్రికుల్ని అందించిన గడ్డ. అంతటి ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ క్రికెట్ కొన్నేళ్లుగా గాడి తప్పింది. పరిపాలకుల అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అప్రతిష్ట మూటగట్టుకుంది.
ప్రస్తుత పాలకుల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో హైదరాబాద్ క్రికెట్ ప్రభ పూర్తిగా మసకబారింది. అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ను ఎవరూ బాగు చేయలేరని అనుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.