ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ను అడ్డుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. భారత్, పాక్ మ్యాచ్ను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత అత్యవసరం ఏం ఉందని? అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమేనని పేర్కొంటూ పిటిషన్ను విచారించేందుకు గురువారం సుప్రీం కోర్టు నిరాకరించింది.
నలుగురు న్యాయ విద్యార్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో ఈ మ్యాచ్ నిర్వహించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్దమని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, పౌరుల మరణాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు.

జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కానీ ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం విచారించేందుకు నిరాకరించింది. అంత అత్యవసరం ఏంటి? అది ఒక మ్యాచ్ మాత్రమే. దానిని జరగనివ్వండని పిటిషనర్ తరఫు న్యాయవాదిని మందలించింది. మ్యాచ్ ఆదివారమే ఉందని న్యాయవాది విజ్ఞప్తి చేసినా ధర్మాసనం పట్టించుకోలేదు. మ్యాచ్ ఈ ఆదివారమేనా? అలానే జరగనివ్వండి అని పేర్కొంది.
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.