ఐపీఎల్ 2025 సీజన్లో ఫైనల్ చేరడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తమ అభిమానుల మద్దతును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై.. హోమ్ గ్రౌండ్ అనుభూతిని కలిగిస్తున్నారని తెలిపాడు. ఇంకొక మ్యాచ్ గెలవాల్సి ఉందని, ఆ తర్వాత అందరం కలిసి సంబరాలు చేసుకుందామని ఆర్సీబీ అభిమానులకు రజత్ పటీదార్ పిలుపునిచ్చాడు.
గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టును చిత్తు చేసింది. ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించింది. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పటీదార్.. ప్రణాళికలకు తగ్గట్లు ఆడి విజయం సాధించామని తెలిపాడు. సుయాశ్ శర్మ, ఫిల్ సాల్ట్పై ప్రశంసల జల్లు కురిపించాడు.

స్పష్టమైన ప్రణాళికలతో..
'ఈ మ్యాచ్లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సుయాష్ రాణించిన తీరు.. అతని లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ అద్భుతం. కెప్టెన్గా అతని బౌలింగ్ గురించి నాకు క్లారిటీ ఉంది. అతను స్టంప్స్ను లక్ష్యంగా చేసుకోని బౌలింగ్ చేయాలి. అదే అతని బలం. అతని బౌలింగ్ను రీడ్ చేయడం బ్యాటర్లు కష్టం. నేనెప్పుడూ అతనికి మంచి చిట్కాలు చెప్పాలనుకుంటాను. నేను అతన్ని అస్సలు కన్ఫ్యూజ్ చేయను. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా పర్వాలేదు.
అతనికి నేను బిగ్ ఫ్యాన్
ఈ టోర్నీ ఆసాంతం మేం చాలా ప్రాక్టీస్ చేశాం. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లే వచ్చే నష్టం ఏం లేదు. ఫిల్ సాల్ట్ చాలా మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదిరిపోయే ఆరంభాలు అందించాడు. అతని బ్యాటింగ్కు నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతని ఆటను చూడటం అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆర్సీబీ అభిమానులకు కృతజ్ఞతలు చెబుతాను. మా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో మాత్రమే కాదు.. మేము ఎక్కడికి వెళ్లినా అది మా సొంత మైదానం అనిపిస్తుంది. మా అభిమానుల్ని మేం ప్రేమిస్తున్నాం. ఇలానే మాకు మద్దతు తెలపండి. ఇంకొకటి గెలవాల్సి ఉంది.ఆ తర్వాత కలిసి వేడుక చేసుకుందాం.'అని రజత్ పటీదార్ అన్నాడు.