ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన టీ20 క్రికెట్ లీగ్. క్షణాల్లో మ్యాచ్ స్వరూపం మారడం.. గెలవాల్సిన జట్టు ఓడిపోవడం.. ఓడాల్సిన జట్టు గెలవడం .. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్లకు ఈ క్యాష్ రిచ్ లీగ్ కేరాఫ్ అడ్రస్.! గత 17 ఏళ్లుగా ఈ ధనాధన్ లీగ్లో ఎన్నో మ్యాచ్లు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే క్రికెట్లోనే అత్యంత ఉత్కంఠను రేపే సూపర్ ఓవర్స్ కూడా ఈ టోర్నీలో ఎన్నోసార్లు జరిగాయి. సూపర్ ఓవర్రకే సూపర్ ఓవర్లు నిర్వహించిన ఘటనలు కూడా ఉన్నాయి.
2009 సీజన్లో తొలి సూపర్ ఓవర్ జరగ్గా.. 2020లో ఒకే మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్స్ జరిగాయి. ఐపీఎల్ 2020 సీజన్లోనే అత్యధికంగా 4 మ్యాచ్ల్లో సూపర్ ఓవర్స్ ఆడించాల్సి వచ్చింది. ఐపీఎల్ 2021 తర్వాత ఇప్పటి వరకు ఒక్క సూపర్ ఓవర్ కూడా జరగలేదు. కనీసం అప్కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్లోనైనా సూపర్ ఓవర్ చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 14 సూపర్ ఓవర్స్ జరిగాయి. ఇక ఐపీఎల్కే ఐకాన్గా నిలిచిన సూపర్ ఓవర్స్పై ఓ లుక్కెద్దాం.!

1.కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్(2009)
ఐపీఎల్ 2009లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి సూపర్ ఓవర్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు 150 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో రాజస్థాన్ గెలిచింది. సూపర్ ఓవర్ ఆ జట్టు విధించిన 16 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ చేధించలేకపోయింది. 11 పరుగులకే పరిమితమైంది.
2.సీఎస్కే వర్సెస్ పంజాబ్(2010)
ఐపీఎల్ 2010లో పంజాబ్ కింగ్స్, సీఎస్కే 136 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో సీఎస్కే 10 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేధించి ఈ మ్యాచ్లో విజయం సాధించింది.
3.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ(2013)
ఐపీఎల్ 2013 సీజన్లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్డెవిల్స్ 152 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చారు. ఆర్సీబీ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేయగా ఢిల్లీ 11 రన్స్కే పరిమితమై ఓటమిపాలైంది.
4.సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ(2013)
ఐపీఎల్ 2013 సీజన్లోనే ఆర్సీబీ, సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా టై అయ్యింది. ఇరు జట్లు సరిగ్గా 130 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో 21 పరుగులు చేసి హైదరాబాద్ గెలవగా.. బెంగళూరు 15 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
5. రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్(2014)
ఐపీఎల్ 2014 సీజన్లో రాజస్థాన్, కేకేఆర్ 152 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 12 పరుగులు చేయగా.. కేకేఆర్ 11 పరుగులు చేసి ఒక్క పరుగుతో ఓటమిపాలైంది.
6. రాజస్థాన్ వర్సెస్ పంజాబ్(ఐపీఎల్ 2015)
ఐపీఎల్ 2015లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ స్కోర్లు టై అయ్యాయి. ఇరు జట్లు సరిగ్గా 191 పరుగులే చేశాయి. సూపర్ ఓవర్లో పంజాబ్ 16 పరుగులు చేసి గెలవగా.. రాజస్థాన్ 6 పరుగులే చేసి చిత్తయ్యింది.
7.ముంబై వర్సెస్ గుజరాత్ లయన్స్(2017)
ఐపీఎల్ 2017 సీజన్లో ముంబై, గుజరాత్ల 153 స్కోర్లు టై అవ్వగా.. సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ముంబై 12 పరుగులు చేసి గెలుపొందగా.. గుజరాత్ 6 పరుగులకే పరిమితమైంది.
8.ఢిల్లీ వర్సెస్ కేకేఆర్(2019)
ఢిల్లీ, కేకేఆర్ 185 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ 11 పరుగులు చేసి కేకేఆర్ను ఓడించింది. ఆ జట్టు సూపర్ ఓవర్లో 7 పరుగులకే పరిమితమైంది.
9.ముంబై వర్సెస్ సన్రైజర్స్(2019)
2019 సీజన్లోనే ముంబై, సన్రైజర్స్ మ్యాచ్ కూడా టై అయ్యింది. ఇరు జట్లు 162 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో 9 పరుగులు చేసి ముంబై విజయం సాధించింది. సన్రైజర్స్ 8 పరుగులకే పరిమితమైంది.
10.ఢిల్లీ వర్సెస్ పంజాబ్(2020)
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాల్సి వచ్చింది. ఇరు జట్లు 157 పరుగులే చేశాయి. సూపర్ ఓవర్లో పంజాబ్ 3 పరుగులే చేయగా.. ఢిల్లీ 4 పరుగులతో గెలుపొందింది.
11. ఆర్సీబీ వర్సెస్ ముంబై(2020)
ఐపీఎల్ 2020 సీజన్లోనే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా సూపర్ ఓవర్కు దారి తీసింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు 201 పరుగులు చేయడంతో స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్లో ఆర్సీబీ 8 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ 7 పరుగులే చేసి ఓటమిపాలైంది.
12.కేకేఆర్ వర్సెస్ సన్రైజర్స్(2020)
ఐపీఎల్ 2020 సీజన్లో కేకేఆర్, సన్రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా టై అయ్యింది. ఇరు జట్లు 163 పరుగులే చేశాయి. సూపర్ ఓవర్లో కేకేఆర్ 3 పరుగులే చేస్తే.. సన్రైజర్స్ 2 పరుగులే చేసి ఓటమిపాలైంది.
13 డబుల్ సూపర్ ఓవర్(2020)
ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా టై అయ్యింది. అయితే ఈ మ్యాచ్ చరిత్రలోనే నిలిచిపోయింది. క్రికెట్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో ఈ మ్యాచ్ ఫలితాన్ని రెండు సూపర్ ఓవర్ల ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఇరు జట్లు 176 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. తొలి సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. రెండో సూపర్ ఓవర్లో ముంబై 12 పరుగులు చేయగా.. పంజాబ్ చేధించింది. ఐపీఎల్ 2020 సీజన్లో మొత్తం నాలుగు మ్యాచ్ల ఫలితాలను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు.
14. ఢిల్లీ వర్సెస్ సన్రైజర్స్(ఐపీఎల్ 2021)
ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్, ఢిల్లీ 159 పరుగులే చేశాయి. దాంతో సూపర్ ఓవర్ ఆడించగా.. ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. సన్రైజర్స్ 7 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఐపీఎల్ 2021 తర్వాత ఒక్క సూపర్ ఓవర్ కూడా జరగలేదు. గత మూడు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా టై అవ్వలేదు.