అంతర్జాతీయ క్రికెట్లోనే కనీవినీ ఎరుగని రీతిలో భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మూడో టీ20 జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం.. చివరకు డబుల్ సూపర్ ఓవర్లో తేలింది. అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలడం ఇదే తొలి సారి. రెండో సూపర్ ఓవర్లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్తో టీమిండియా గట్టెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. భారత్ కూడా 16 పరుగులే చేసింది.

దాంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్లో భారత్ 11 పరుగులు చేయగా.. అఫ్గాన్ ఒక్క పరుగే చేసి రెండు వికెట్లు పోయింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్లు పరిగణిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూసిన అభిమానులు.. సూపర్ ఓవర్ రూల్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బాల్ ఔట్ రూల్..
అంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఈ పద్దతిలో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు ఐదు బంతులతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అవడంతో ఈ పద్ధతినే అవలంభించారు. ఆ తర్వాత సూపర్ ఓవర్ రూల్ తీసుకొచ్చారు.
ఇంగ్లండ్ తొండాటతో..
2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముందు వరకు ఒకే ఒక్క సూపర్ ఓవర్తో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేవారు. సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువగా చేసిన జట్టును విజేతగా నిర్ణయించేవారు. ఇరు జట్ల బౌండరీలు సమమైతే.. సూపర్ ఓవర్లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు.
అయితే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌండరీ కౌంట్ రూల్తో న్యూజిలాండ్పై గెలిచి టైటిల్ అందుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ రూల్ పూర్తిగా అసంబద్దమైనదని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. దాంతో ఈ రూల్పై సమీక్ష జరిపిన ఎంసీసీ.. ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడించాలని నిర్ణయించింది.
సూపర్ ఓవర్ రూల్స్..
సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్లో వేయకూడదు. ఒక్కసారి బౌలింగ్ చేస్తే మరో సూపర్ ఓవర్ వేసేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలోనే భారత్, అఫ్గాన్లు వేర్వేరు బౌలర్లతో బౌలింగ్ చేయించాయి.
బ్యాటింగ్ విషయంలో చేజింగ్ టీమ్ తొలి సూపర్ ఓవర్ ఆడుతుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ ఓవర్లోనూ చేజింగ్ జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.
తొలి సూపర్ ఓవర్లో ఔటైన బ్యాటర్కు రెండో సూపర్ ఓవర్లో ఆడే అవకాశం ఉండదు. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగే మాత్రం అవకాశం ఉంటుంది. కానీ నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన తర్వాత కూడా బ్యాటింగ్కు అనుమతించారు. ఇది రూల్స్కు విరుద్దం. ఇక సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందే ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు అందజేయాలి. వారు మాత్రమే బ్యాటింగ్ చేయాలి. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైన్లే.
ఒక వేళ డబుల్ సూపర్ ఓవర్ టై అయితే మూడో సూపర్ ఓవర్ ఆడాలి. ఇలా ఫలితం తేలే వరకు సూర్ ఓవర్స్ నిర్వహించాలి. అయితే భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్కు ముందు ఐపీఎల్ 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ డబుల్ సూపర్ ఓవర్స్ ఆడాయి. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్ సూపర్ ఓవర్ అయితే జరగలేదు.