ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన జట్లు తీవ్రంగా నిరాశపరుస్తుండగా.. అనామక జట్లు సంచలన ప్రదర్శనతో చెలరేగుతున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమై రెండు వారాలు పూర్తవ్వగా.. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్కే టాప్-4లో నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ దారుణంగా విఫలమయ్యాయి. సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేశాయి.

తొలి రెండు వారాల ప్రదర్శన ఆధారంగా సూపర్ కంప్యూటర్ (BETSiE Super Computer)ఐపీఎల్ 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేసింది. అంతేగాకుండా లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉండనుందో ప్రిడిక్ట్ చేసింది.
ఈ అంచనాలో సూపర్ కంప్యూటర్ చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంది. మ్యాచ్ డాటా, రన్ రేట్, ఓవర్లు, వికెట్లతో అంచనా వేసింది. మ్యాచ్ డాటా సాయంతో భవిష్యత్తు మ్యాచ్ల ఫలితాలను లెక్కించింది. ఈ లెక్కలతో ప్రతీ జట్టు యావరేజ్ రన్ రేట్ ఎంతో చెప్పింది.
సూపర్ కంప్యూటర్ అంచనా ప్రకారం రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతాయని పేర్కొంది. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి స్థానంలో నిలవనున్నాయి.