న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జట్టు ఎంపికను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఫిట్గా లేని కేఎల్ రాహుల్ను ఎందుకు ఎంపిక చేశారని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా బ్యాకప్ను ఎంపిక చేయకపోవడాన్ని కూడా విమర్శిస్తున్నారు.
హార్దిక్ పాండ్యాకు శార్దూల్ ఠాకూర్ సరైన బ్యాకప్ కాదని, శివమ్ దూబేను తీసుకోవాల్సిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సూచనలను మాజీ సెలెక్టర్ సునీల్ జోషి తప్పుబట్టాడు. ఆసియాకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు బ్యాలెన్సింగా ఉందని తెలిపాడు. 'జట్టులో మార్పులు అవసరం లేదనిపిస్తోంది.

శివమ్ దూబే ప్రదర్శన చూశాం. టీ20ల్లో బాగానే ఆడుతున్నప్పటికీ వన్డే ఫార్మాట్లో అతనికి మెరుగైన రికార్డు లేదు. మరీ ముఖ్యంగా బౌలింగ్లో గొప్ప ప్రదర్శనేమీ లేదు. ఫీల్డింగ్లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. శార్దూల్ ఠాకూర్ ఇటీవల అద్భుతంగా రాణించాడు. 'అని సునీల్ జోషి చెప్పుకొచ్చాడు.
అంతకుముందు గంభీర్ మాట్లాడుతూ.. శివమ్ దూబేను ఎంపిక చేయాల్సిందన్నాడు. 'హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా శివమ్ దూబేను ఎంపిక చేయాల్సింది. శార్దూల్ ఠాకూర్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అంతేకాకుండా ఓ మణికట్టు స్పిన్నర్ ఉండాల్సింది. ఒక పేసర్కు బదులు యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్లలో ఒకరిని ఎంపిక చేయాల్సింది. ఉపఖండ పిచ్లపై మణికట్టు స్పిన్నర్లు చాలా ప్రభావం చూపిస్తారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో నేపాల్తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్లో భారత్-పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.