భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో రెండున్నర నెలల సమయం ఉన్నా.. అప్పుడే ఈ ఐదు మ్యాచ్ల సిరీస్కు సంబంధించి చర్చ మొదలైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాటు జోస్యాలు చెబుతూ.. ఈ సిరీస్కు హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈ సారి భారత్ గెలవడం కష్టమని, ఆసీస్ విజయం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతుంటే.. భారత మాజీ ప్లేయర్లు మాత్రం టీమిండియా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రవిశాస్త్రి, రికీ పాంటింగ్, జెఫ్ లాసన్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే తమ మైండ్ గేమ్ స్టార్ట్ చేయగా.. ఈ సిరీస్లో గెలిచిన జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోనుంది.
దాంతో ఈ సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లు సన్నదమవుతున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్, ఆస్ట్రేలియా టాప్-2లో కొనసాగుతున్నాయి. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడిన గవాస్కర్.. స్టీవ్ స్మిత్ను హెచ్చరించాడు. జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం అతనికి కష్టమేనని చెప్పాడు.
'ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు సొంతగడ్డపై భారత్ రెండు టెస్ట్ సిరీస్లు ఆడనుంది. ఆటగాళ్లు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఈ సిరీస్లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల మధ్య మైండ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. మాజీ ఆటగాళ్లు తమ మాటలకు పదును పెట్టారు. మెక్గ్రాత్ కూడా ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయగలదని చెప్పలేకపోతున్నాడు. తమ జట్టు గెలుస్తుందని మాత్రమే చెబుతున్నాడంటేనే.. భారత్ ఎలాంటి పోటీనిస్తుందో అర్థమవుతుంది.
గత సిరీస్లో ఆడిన ఆటగాళ్లలో కొందరు ఈసారి ఎంపికవుతారో లేదో తెలియదు. అలాంటి వారిలో స్టీవ్ స్మిత్, అశ్విన్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉండేది. స్మిత్ను ఔట్ చేసేందుకు అశ్విన్ ప్రత్యేకంగా అస్త్రాలను సిద్ధం చేసేవాడు. రాబోయే సిరీస్లోనూ స్మిత్ ఉంటే బుమ్రాను ఎదుర్కొవడం కష్టంగా ఉంటుందనేది నా అభిప్రాయం.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.