
ఓపెనర్గా కొనసాగాలి..
ఈ నేపథ్యంలో ఇండియాటుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. విరాట్-రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలన్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా మిడిలక ఆర్డర్లో ఆడేవాడని, ఓపెనింగ్కు వచ్చాక భారత జట్టు రూపురేఖలే మారిపోయాయని ఈ లిటిల్ మాస్టర్ గుర్తు చేశాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ అధిక ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. విరాట్ కోహ్లీ కూడా ఇలాగే ఓపెనర్గా కొనసాగాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ లేకపోవడం..
రాహుల్ ఫామ్లో లేకపోవడం ఒక విధంగా టీమిండియాకు కలిసొచ్చిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'రాహుల్ ఫామ్ కోల్పోవడం భారత జట్టుకు కలిసొచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జోడీ(రోహిత్-కోహ్లీ) భవిష్యత్పై ఆశలు పెట్టుకునేలా చేసింది. సచిన్ కూడా మొదట్లో మిడిల్ఆర్డర్లో ఆడేవాడు. అతడిని ఓపెనింగ్లో పంపించగానే టీమ్ఇండియా రూపురేఖలే మారిపోయాయి. అది అతడి వ్యక్తిగత ప్రదర్శన మీదే కాకుండా జట్టు మొత్తంపైనే ప్రభావం చూపింది. కాబట్టి, బాగా ఆడేవారిని ముందుగా బ్యాటింగ్కు పంపాలి. రోహిత్, కోహ్లీ జోడీని ఇలాగే కొనసాగించాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

కోహ్లీ కూడా...
ఇక, రాహుల్ ఈ సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి ఆడినా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టీ20లో ఒక్క పరుగు చేసిన అతను తర్వాత 0, 0, 14 పరుగులు చేశాడు. దీంతో ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న అతన్ని టీమిండియా చివరి మ్యాచ్లో పక్కకుపెట్టింది. ఈ క్రమంలోనే రోహిత్తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. దాంతో వారిద్దరూ ఇంగ్లండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈ కొత్త ప్రయోగం బాగా పనిచేయడంతో కోహ్లీ సైతం రోహిత్తో మళ్లీ ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. దీంతో అభిమానులు సైతం భవిష్యత్లో వీరిద్దరూ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications
