ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో టీమిండియా ఓటమిపాలవ్వడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐదు సెంచరీలు బాదినా గెలవకపోవడం బాలేదన్నాడు. భారత జట్టు టెస్ట్ క్లాస్ ఆట ఆడలేదని, టెస్ట్ మ్యాచ్ ఆడే విధానం ఇది కాదని మండిపడ్డారు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఈ తొలి మ్యాచ్ ఓడినా.. పుంజుకునేందుకు ఇంకా అవకాశం ఉందన్నాడు. భారత ఆటగాళ్లు ఆప్షనల్ ప్రాక్టీస్ పేరిట దొంగేశాలు వేయవద్దని సూచించాడు. కఠోర సాధన చేయాలని సూచించాడు.
'ఈ గెలుపు క్రెడిట్ ఇంగ్లండ్దే. ఎందుకంటే టీమిండియా బ్యాటర్లు ఐదు శతకాలు నమోదు చేసినా ఇంగ్లండ్ ఆటగాళ్లు.. విజయంపై నమ్మకం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసంతో ఆడారు. అనుకున్న విజయం సాధించారు. ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలను భారత్ చేజార్చుకుంది. ఫీల్డింగ్లో క్యాచ్లు నేలపాలు చేయడం జట్టుకు నష్టం చేసింది. బౌలింగ్లోనూ కొన్ని పరుగులు ఎక్కువగా ఇచ్చారు. భారత జట్టు టెస్ట్ క్లాస్ ఆట ఆడలేదు.

అయితే ఈ మ్యాచ్లో బౌలర్లను నిందించడానికి లేదు. ఎందుకంటే ఇది మంచి బ్యాటింగ్ పిచ్. అయినా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతనికి మరో ఎండ్లో సహకారం లభించలేదు. అయితే ఇది తొలి టెస్ట్ మాత్రమే. ఈ సిరీస్లో పుంజుకోవడానికి భారత జట్టుకు అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఆటగాళ్లు ఓ రెండు రోజులు విశ్రాంతి తీసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఆటగాళ్లంతా ఆప్షనల్ ప్రాక్టీస్ అనే చట్రం నుంచి బయటకు రావాలి. దేశం తరఫున ఆడేందుకే ఇంగ్లండ్కు వచ్చారు. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన చేసేలా సాధన చేయాలి.'అని గవాస్కర్ సూచించాడు.