న్యూఢిల్లీ: ఈ తరం టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించిన దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లకు బలుపు ఎక్కువన్నాడు. సలహాలు, టిప్స్ కోసం ఒక్కరు కూడా మాజీ క్రికెటర్లను సంప్రదించడం లేదని, వారిని ఏంది కలిసేది? అనే అహంతో ఉంటున్నారని తెలిపాడు.
కానీ సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తాము ఆడే సమయంలో తరుచూ మాజీ క్రికెటర్ల సలహాలు, టిప్స్ తీసుకునేవారని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత టీమిండియా బ్యాటర్లలో టెక్నికల్ సమస్యలున్నా.. ఒక్కరు కూడా తనను కానీ ఇతర మాజీ క్రికెటర్లను కానీ సంప్రదించలేదన్నాడు.

ఈ తరం ఆటగాళ్ల ప్రవర్తన తనను షాక్కు గురిచేస్తోందని చెప్పాడు. 'బ్యాటర్లు మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే వారి బ్యాటింగ్ టెక్నిక్లో ఏదో సమస్య ఉందని అర్థం. ఆ సమస్యను మాజీ క్రికెటర్లతో చర్చించి పరిష్కారించుకోవాలి. బ్యాటింగ్ను ఎలా మెరుగుపరుచుకోవాలి? గార్డ్ ఏమైనా మార్చుకోవాలా? లెగ్ స్టంప్ గార్డ్ తీసుకోవద్దా? మిడిల్ ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకోవాలా? అని విషయాలను అడిగి తెలుసుకోవాలి.
కానీ ఈ తరం ఆటగాళ్లలో ఒక్కరు కూడా ఈ విషయంపై నన్ను సంప్రదించలేదు. కానీ గతంలో సెహ్వాగ్ ఈ తరహా సమస్య ఎదుర్కొన్నప్పుడు నా సలహా కోరాడు. ఒకసారి ఆఫ్ స్టంప్ గార్డ్ ప్రయత్నించి చూడమని చెప్పాను. దానికి అతను ఎందుకు సన్నీ భాయ్ అని ఎదురు ప్రశ్నించాడు. నేను వెంటనే నీకు మంచి ఫుట్ వర్క్ లేదనే విషయం నీతో పాటు అందరికి తెలుసు.
ఫుట్ వర్క్ సమస్యతో నీవు వికెట్ పారేసుకుంటున్నావు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు. ఆఫ్ స్టంప్ గార్డ్ తీసుకుంటే అది ఆఫ్ స్టంప్ బాల్ అనే విషయం ఈజీగా అర్థమవుతోందని చెప్పాను. ఈ సలహా అతనికి ఉపయోగపడింది. సెహ్వాగ్తో పాటు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ కూడా తరుచుగా నా సలహాలు తీసుకునేవారు.
వారంత ఏదో ఒక సమస్యతో నా దగ్గరకు వచ్చేవారు. వారి ఆటను పరిశీలించి చూస్తాం కాబట్టి సమస్యకు పరిష్కారం చెప్పగలం. ఈ తరం ఆటగాళ్లకు సలహా ఇచ్చే విషయంలోనూ నాకు ఎలాంటి ఇగో లేదు. నేనే వెళ్లి స్వయంగా వారికి సలహాలు ఇవ్వవచ్చు. కానీ జట్టులో ఇద్దరు కోచ్లు రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్లు ఉన్నారు. కాబట్టి ఆటగాళ్లను సంప్రదించి వారిని మరింత అయోమయానికి గురి చేయదలుచుకోవడం లేదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.