సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ క్యాచ్ ఔట్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. థర్డ్ అంపైర్పై సన్రైజర్స్ హైదరాబాద్(SRH) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కోణాల్లో పరిశీలించకుండా అంత త్వరగా నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏం ఉందని మండిపడుతున్నారు.
కొందరు మాజీ క్రికెటర్లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం థర్డ్ అంపైర్ తీరుపై విమర్శలు గుప్పించాడు. ఇంకాస్త సమయం కేటాయించి నిర్ణయం ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
'థర్డ్ అంపైర్ మరికాస్త సమయం కేటాయిస్తే బాగుంటుంది. సమీక్షించేందుకు తొందర ఎందుకు? ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ను టచ్ చేసినట్లు కొందరికి అనిపించింది. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కు అవకాశం ఇవ్వాలి. అందుకే నాకు ఈ నిర్ణయం సరిగ్గా అనిపించలేదు.'అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

రొమారియో షెఫెర్డ్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను డీప్ మిడ్వికెట్ బౌండరీ లైన్పై ఫిల్ సాల్ట్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో అతను బౌండరీ రోప్పై పడినట్లు కనిపించింది. ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలు మార్లు రిప్లేలను పరిశీలించిన అంపైర్.. క్లాసెన్ను క్యాచ్ ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ మరో కోణం నుంచి పరిశీలించకుండా నిర్ణయం ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ నుంచి చివరి నిమిషంలో తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి సునీల్ గవాస్కర్ సూచించాడు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల నిషేధం రూల్ సరిపోదని, ఈ నిబంధనను మరింత కఠినంగా మార్చాలని అభిప్రాయపడ్డాడు. 'ఐపీఎల్ నుంచి చివరి నిమిషంలో తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న రెండేళ్ల నిషేధం సరిపోదు.
అది ఎవరిపైనా ప్రభావం చూపించదు. అందుకు బీసీసీఐ కఠినమైన రూల్ తీసుకురావాలి.'అని గవాస్కర్ సూచించాడు. ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్ ప్రకారం.. ఏ విదేశీ ఆటగాడైనా అనుమతి లేకుండా వైదొలిగితే రెండేళ్ల నిషేధం పడుతుంది. కుటుం, వైద్యపర్యమైన కారణాలు ఉంటే.. ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి ఇస్తుంది. బెన్ డకెట్ చివరి నిమిషంలో ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతోనే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.