న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో తొలి టీ20లో సంజూ శాంసన్ ఔటైన తీరును తప్పుబట్టాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, చెత్త షాట్తో మూల్యం చెల్లించుకున్నాడని మండిపడ్డాడు. శ్రీలంకతో మంగళవారం ముంబై వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ 2 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అవకాశం అందుకున్న సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
శ్రీలంక ఫీల్డర్ తప్పిదంతో ఓ అవకాశం వచ్చినా.. అందిపుచ్చుకోలేకపోయాడు. 6 బంతుల్లో ఐదు పరుగులే చేసి చెత్త షాట్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో సంజూ శాంసన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సొంత అభిమానులు కూడా సంజూ ఔటైన తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలోనే
సంజూ వైఫల్యంపై మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమవాస్య, పౌర్ణమికి వచ్చే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుంటే ఎలా? అని నిలదీసాడు.
'సంజూ శాంసన్ ఈసారి బ్యాట్ ఎడ్జ్కు తాకి ఔటయ్యాడు. భారీ షాట్ ఆడాలనే ఆతృతలో మూల్యం చెల్లించుకున్నాడు. సంజూ శాంసన్ మెరుగైన ఆటగాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. కానీ అతని షాట్ సెలక్షన్ మాత్రం కరెక్ట్గా లేదు. అదే అతన్ని బెంచ్ మీద కూర్చోబెడుతున్నది. ఇలా విఫలమైన ప్రతీసారి అతనిపై వేటు తప్పడం లేదు.
మరోసారి అతను తీవ్రంగా నిరాశపరిచాడు.'అని కామెంట్రీ సందర్భంగా గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ ఆటతీరుపై ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నాడని మండిపడుతున్నారు. పంత్ గైర్హాజరీలో జట్టులో పాతుకుపోక.. పేలవ బ్యాటింగ్తో అవకాశాలు దెబ్బతీసుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.
బ్యాటింగ్లో విఫలమైన సంజూ.. ఓ క్యాచ్ కూడా నేలపాలు చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పాతుమ్ నిస్సంక ఇచ్చిన క్యాచ్ను సంజూ సూపర్ డైవ్తో అందుకున్నాడు. కానీ డైవ్ పూర్తయ్యే క్రమంలో బంతి చేజారింది.