
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ.. వస్తున్న పుకార్లను లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొట్టి పారేశాడు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రవర్తించిన తీరే వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పడానికి నిదర్శనమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన గవాస్కర్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు.
'రోహిత్, కోహ్లీ ఇద్దరూ భారత జట్టు కోసం చాలా కష్టపడుతున్నారు. మైదానంలో ఇద్దరూ చనువగానే ఉంటున్నారు. జట్టు కోసం కష్టపడే వాళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి? ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీడియాలో వీళ్ల గురించి వస్తున్నవన్నీ ఊహాగానాలే. చాలా ఏళ్లుగా అవే ప్రచారం అవుతున్నాయి. నిజమేంటో వాళ్లిద్దరికీ తెలుసు. కాబట్టి, ఇలాంటి వదంతుల గురించి పెద్దగా పట్టించుకోకుండా.. తమ పని తాము చేసుకుపోతున్నారు. అలాగే, టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ విజయవంతం కాకూడదని కోహ్లీ కోరుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అదంతా నాన్సెన్స్.
వారిద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. మైదానంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ భారత జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారు. టీమిండియా తరఫున ఆడుతున్న బ్యాట్స్మన్ పరుగులు చేయకున్నా.. బౌలర్ వికెట్లు తీయడంలో విఫలమైనా జట్టులో స్థానం కోల్పోవడం ఖాయం. దిగ్గజ ఆటగాళ్లకైనా అది తప్పదు. కోహ్లీ ఎవరి సారథ్యంలో ఆడినా.. జట్టు కోసం కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాడు. భారీగా పరుగులు చేస్తాడు' అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో జరిగిన చారిత్రక 1000వ వన్డే మ్యాచ్ ద్వారా పూర్తి స్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టగా.. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. డీఆర్ఎస్ విషయంలోనూ విరాట్ రోహిత్కు పలు సూచనలు చేసాడు. కోహ్లీ సలహాతోనే రోహిత్.. చాహల్తో కలిసి పొలార్డ్ వికెట్కు స్కెచ్ వేసి ఫలితం రాబట్టాడు.