టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబే కంకషన్ సబ్స్టిట్యూషన్పై తీవ్ర చర్చ జరుగుతోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం.. కంకషన్ సబ్స్టిట్యూషన్ను తప్పుబట్టాడు. ఛీటింగ్ చేసి గెలవాల్సిన అసవరం లేదని టీమిండియా మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో పుణె వేదికగా జరిగిన నాలుగో టీ20లో శివమ్ దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకడంతో కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అతను మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణా ఆడించడం అన్యాయమని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా ఏ మాత్రం సరిపోలే ఆటగాడు కాదన్నాడు. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియాకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారని, ఈ తప్పిదాన్ని అంగీకరించాలని కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశాడు.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, సీనియర్ రిషరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రిఫరీలు పక్షపాతంతో వ్యవహరించడం సరికాదన్నాడు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సునీల్ గవాస్కర్.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. కంకషన్ సబ్స్టిట్యూషన్ను తప్పుబట్టాడు.
'పుణె మ్యాచ్లో శివమ్ దూబే చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్లో మరో రెండు బంతులు ఉందనగా.. హెల్మెట్ను బంతి తాకింది. అప్పటికి అతను కంకషన్ గాయానికి గురవ్వలేదు. బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత కంకషన్ సబ్స్టిట్యూట్ను అనుమతించడం సరైంది కాదనిపిస్తోంది. ఒకవేళ సబ్స్టిట్యూట్ తీసుకోవాలనుకుంటే అతన్ని ఫీల్డింగ్ వరకే పరిమితం చేయాల్సింది. బౌలింగ్ చేయించడం సరికాదు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా ఏమాత్రం సరిపోలే ఆటగాడు కాదు. ఒక ఎత్తు ఉన్నంత మాత్రానా సరిపోదు. కాబట్టి ఇంగ్లండ్ విమర్శలు చేయడంలో తప్పు లేదు. భారత్ వంటి అద్భుతమైన జట్టు ఇలా ఛీటింగ్ చేసి గెలవాల్సిన అవసరం లేదు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.