కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడటం చేతగాని వాళ్ల కోసం ఈ రూల్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ రూల్కు బదులు ఇంజ్యూరీ రీప్లెస్మెంట్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి అతని కుడి కాలి పాదానికి బలంగా తాకింది. దాంతో కాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. తీవ్ర గాయమైనా రిషభ్ పంత్ జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించి హాఫ్ సెంచరీ సాధించాడు. బై రన్నర్ రూల్ను ఐసీసీ ఎత్తేయడంతో కుంటుతూనే బ్యాటింగ్ చేశాడు.
రిషభ్ పంత్ బాధను చూసిన గవాస్కర్.. ఐసీసీ రూల్స్పై అసహనం వ్యక్తం చేశారు. రిషభ్ పంత్ తరహాలో స్పష్టమైన గాయం ఉందని తెలిసినప్పుడు లైక్ ఫర్ లైక్ సబ్స్టిట్యూట్ను అనుమతించాలని లిటిల్ మాస్టర్ డిమాండ్ చేశారు. వికెట్ కీపర్కు వికెట్ కీపర్, ఆల్రౌండర్కు ఆల్రౌండర్, బౌలర్కు బౌలర్, బ్యాటర్కు బ్యాటర్ను అనుమతించేలా రూల్స్ తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలోనే కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ను తప్పుబట్టారు.

'షార్ట్ పిచ్ బాల్స్ ఆడలేకపోతే క్రికెట్ ఆడొద్దు. ఏ టెన్నిసో, గోల్పో ఆడుకోవాలి. అక్కడ గాయపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. షార్ట్ బాల్స్ ఆడలేక గాయపడే వారికి కంకషన్ సబ్స్టిట్యూట్ కింద మరో ఆటగాడిని రిప్లేస్ చేయడం సరికాదు. రిషభ్ పంత్లా స్పష్టమైన శరీర గాయాలైనప్పుడు రీప్లేస్మెంట్ ఆటగాడిని అనుమతించాలి.'అని సోనీ స్పోర్ట్స్ షోలో గవాస్కర్ అన్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంజ్యూరీ రిప్లేస్మెంట్కు అవకాశం ఇచ్చేలా రూల్స్ మార్చాలని ఐసీసీని కోరాడు.
ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం నేపథ్యంలో ఐసీసీ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ తీసుకొచ్చింది. తలకు గాయమైనప్పుడు ఫిజియోలు వచ్చి ఆటగాళ్లను చెక్ చేసేలా కండిషన్ పెట్టింది. కంకషన్ సబ్గా ఆడిన తొలి ఆటగాడిగా ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ నిలిచాడు. 2019లో యాషెస్ సిరీస్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్ తలకు తగిలింది. అతని స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా మార్నస్ లబుషేన్ను బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ రూల్ను మిస్ యూస్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తలకు చిన్న గాయం అయినా కంకషన్ సబ్స్టిట్యూట్ తీసుకుంటున్నారు. లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ ఆటగాళ్ల విషయంలో జట్లు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఈ రూల్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.