అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్లో ఉంచడం, పసికూన దేశాలతో గ్రూప్ సీడింగ్ తీయడాన్ని తప్పుబట్టాడు. వాణిజ్య ప్రయోజనాల కోసమే ఐసీసీ ఇలా గ్రూప్ సీడింగ్ చేసిందని ఓ దినపత్రికకు రాసిన కాలమ్లో గవాస్కర్ విమర్శించాడు. భారత్, పాకిస్థాన్లు సునాయసంగా తదుపరి రౌండ్ చేరుకునేలా నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్తో కూడిన గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్లు ఉంచిందని ఆరోపించాడు.
'సాధారణంగా జరిగే ప్రతి ఐసీసీ టోర్నీలానే.. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్లను ఒకే గ్రూప్లో ఉంచారు. కేవలం ఈ రెండు దేశాల మధ్య కనీసం ఒక మ్యాచ్ నిర్వహించాలని, తద్వారా వచ్చే ఆదాయం, వ్యూయర్షిప్ను క్యాష్ చేసుకోవాలనే ఐసీసీ ఇలా ప్లాన్ చేసింది. భారత్, పాకిస్థాన్ జట్లు సునాయసంగా తదుపరి రౌండ్ అయిన సూపర్-8కు చేరుకునేలా ఈజీ గ్రూప్ను సిద్దం చేశారు. గ్రూప్ దశలో పెద్ద జట్లు పసికూనలతో తలపడుతుండటంతో సూపర్-8 నుంచే అసలు పోరు మొదలవ్వనుంది.
అయితే ఈజీ గ్రూప్లో ఉన్నా పాకిస్థాన్కు అంత ఈజీ కాదు. గత ప్రపంచకప్లో పాకిస్థాన్ పసికూన జట్ల చేతిలో ఓటమిపాలైంది. ముఖ్యంగా అమెరికా చేతిలో ఓడింది. ఈ సారి ఆ జట్టు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమెరికా ఆటగాళ్లు మేజర్ లీగ్ క్రికెట్ ద్వారా కావాల్సిన అనుభవం పొందారు. మరింత బలంగా తయారయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో కూడా తెలుసుకున్నారు. ఈ సారి కూడా పాకిస్థాన్కు అమెరికా షాక్ ఇవ్వవచ్చు.

భారత్, పాక్లు సునాయసంగా సూపర్ 8కు చేరుకుంటాయి. అయితే పాకిస్థాన్ నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టుకు ఇబ్బందులు కలిగించవచ్చు.'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో అమెరికాతో భారత్ తలపడనుంది. భారత్, పాక్ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే విషయమై దాయదీ పాకిస్థాన్ నాటకం ఆడుతోంది. టోర్నీలో పాల్గొనమని, భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని మీడియాకు లీకులు ఇస్తూ. ఐసీసీని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఆడకుండా బంగ్లాదేశ్ను ఉసిగొల్పిన పాకిస్థాన్.. ఆఖరికి ఆ జట్టును ఆగం చేసింది. తాము అండగా ఉంటామని చెప్పి సైడ్ అయ్యింది. పాకిస్థాన్ను నమ్ముకొని బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయింది.
ఐసీసీ ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును పీసీబీ తుది నిర్ణయం ప్రకటించినా.. టోర్నీలో పాల్గొనే వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. తమకు ఉన్న అన్ని ఆప్షన్స్ పరిశీలించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పాక్ ప్రధాని సూచించారని పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ట్వీట్ చేశాడు. తమ నిర్ణయాన్ని శుక్రవారం లేదా సోమవారం వెల్లడిస్తామని పేర్కొన్నాడు. భారత్తో మ్యాచ్ బహిష్కరించినా.. టోర్నీ నుంచి మొత్తం తప్పుకున్నా పీసీబీ తీవ్రంగా నష్టపోతుంది.