న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ టీమ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని నలుగురు సభ్యుల భారత సెలెక్షన్ కమిటీపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో జట్టులో కీలక మార్పులు చేసిన సెలెక్టర్లు చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్పై వేటు వేసారు. వారి స్థానాల్లో ఐపీఎల్లో సత్తా చాటిన యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్లను తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో గత మూడు సీజన్లుగా రాణిస్తున్న సర్ఫరాజ్ఖాన్ను మరోసారి పట్టించుకోలేదు.

దాంతో భారత టీమ్ సెలెక్షన్ తీరును అభిమానులు తప్పుబడుతున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జట్టును ఎంపిక చేసినప్పుడు రంజీ ట్రోఫీ నిర్వహించడం ఎందుకు? అని బీసీసీఐకి చురకలంటించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైనప్పుడు పుజారా ఒక్కడినే ఎందుకు బలి పశువును చేశారని నిలదీసాడు.
భారత టెస్ట్ టీమ్ ఎంపికపై ఇండియా టుడే ఛానెల్తో మాట్లాడిన గవాస్కర్ సెలెక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ ఆడాడా? రోహిత్ చెలరేగాడా? శుభ్మన్ అదరగొట్టాడా? అని ప్రశ్నించాడు. అసలు సెలెక్టర్లు జట్టును ప్రకటించేటప్పుడు మీడియా సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని నిలదీసాడు.
'చతేశ్వర్ పూజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు? డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైనప్పుడు పుజారాను మాత్రమే ఎందుకు బలిపశువును చేశారు? విరాట్ కోహ్లీ ఏమైనా రాణించాడా? రోహిత్ శర్మ అదగొట్టాడా? శుభ్మన్ గిల్ కూడా ఒరగబెట్టిందేమీ లేదే.
చతేశ్వర్ పూజారా ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్న అతను.. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.వందుకు పైగా టెస్టులు ఆడిన జట్టుకు ఎంతో సేవ చేశాడు. అలాంటి పుజారాకు సోషల్ మీడియా వేదికగా మిలియన్ల ఫాలోవర్లు లేరనే తప్పించారా?
పుజారాను తప్పిస్తే అడిగేటోడే లేడనుకున్నారా?. అదే విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో తీసేస్తే ఫ్యాన్స్ గగ్గోలు పెడతారని భయపడ్డారా? చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ధైర్యం చేయలేదా? అయినా జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదు. మీడియా వేసే ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ దగ్గర జవాబులు లేవనే ఇలా చేస్తున్నారు కదా? పూజారా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో ఎంతో అనుభవం ఉంది.
ఈరోజు 39-40 ఏళ్లు వచ్చే వరకూ టెస్టుల్లో ఆడుతున్నారు. పూజారాకు కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింక్యా రహానే తప్ప, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగ్గా ఆడలేదు. అయినా పూజారాని మాత్రమే తప్పించడం వెనుక ఉన్న కారణం ఏంటో సెలెక్టర్లు చెప్పాలి.'అని గవాస్కర్ అన్నాడు.