
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. భారత వెటరన్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడంటూ ఇంగ్లీష్ మీడియా అతనిపై దుమ్మెత్తిపోసింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ రాహుల్ త్రిపాఠి విసిరిన త్రో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ను తాకి ఓవర్ త్రోగా మారగా అశ్విన్ మరో పరుగు తీసాడు. సాంప్రదాయం ప్రకారం ఫీల్డర్ విసిరిన బంతిని బ్యాట్స్మన్కు తగిలినప్పుడు పరుగులు తీయరు. అయితే నిబంధనల్లో మాత్రం తీవయవద్దనే రూల్ ఏం లేదు.
అయితే ఇలా అశ్విన్ పరుగు తీయడాన్ని కోల్కతా ఆటగాళ్లు తప్పుబట్టారు. అశ్విన్ ఔటవగానే.. మోసం చేస్తే ఇలాగే జరుగుతుంది అని కోల్కతా పేసర్ టీమ్ సౌథీ అన్నాడు. దాంతో అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. మోర్గాన్ జోక్యం చేసుకున్నాడు. దాంతో గొడవ పెద్దది అయింది. ఇక్క అక్కడే ఉన్న కీపర్ దినేశ్ కార్తీక్ అశ్విన్కు సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత దినేశ్ కార్తీక్.. ఎక్స్ట్రా రన్ వల్లే గొడవ జరిగిందని చెప్పడంతో ఈ వాగ్వాదంపై దుమారం రేగింది. సోషల్ మీడియా వేదికగా ఓ చర్చకు దారితీసింది.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ను తప్పుబడుతున్నవారంతా రిషభ్ పంత్ను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించాడు. మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్లో ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ అశ్విన్ను వెనకేసుకొచ్చాడు. ఈ పరుగు విషయంలో అశ్విన్ది ఎంత తప్పుందో.. పంత్ది కూడా అంతే ఉందన్నాడు. అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించినప్పుడు పూర్తి చేసింది పంతేనని, అతని పాత్ర కూడా ఉందన్నాడు. పంత్ పరుగు తీయకుండా అడ్డుకోవాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'అశ్విన్కు సంబంధించిన ఈ వివాదంలో ఎవరూ అడగని విషయం ఏదైనా ఉందంటే? పంత్ పరుగు కోసం ఎందుకు పరుగెత్తాడు? బంతి తాకిన విషయం అతనికి స్పష్టంగా తెలుసు. అలా తగిలినప్పుడు పరుగు తీయడం సంప్రదాయం కాదనే విషయం కూడా తెలుసు. పైగా అతని ఢిల్లీ కెప్టెన్. కానీ జట్టుకు కావాల్సిన స్కోర్ చేయాలనే ఆందోళనలో అతను పరుగు తీసి ఉంటాడు. మరీ అశ్విన్ను ఎందుకు నిందిస్తున్నారు? పంత్కు బంతి తాకిన విషయాన్ని కూడా అతను చూడకపోవచ్చు. ఎందుకంటే అతను పరుగు పూర్తి చేసే స్థితిలో ఉంటాడు. ఫీల్డర్కు దూరంగా ఉండే బంతిని మాత్రమే చూసి ఉంటాడు. దాంతోనే అదనపు పరుగు తీసేందుకు సిద్దమయ్యాడు. పంత్ వద్దని వారించి ఉండాల్సింది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.