
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ దూకుడు తగ్గించుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. నిర్లక్ష్యపు షాట్స్తో వికెట్ పారేసుకుంటున్న రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలిపై గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. రిషభ్ పంత్లో గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడుతూ విమర్శల పాలవుతున్నాడని పేర్కొన్నాడు. అతను కాస్త సంయమనంతో ఆడితే.. భారత జట్టుకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన గవాస్కర్.. పంత్తో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాలని కోరాడు.
'రిషభ్ పంత్ సత్తా ఏంటో మనందరికీ బాగా తెలుసు. రోజు రోజుకి అతని బ్యాటింగ్పై మన అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఓ మ్యాచులో దారుణంగా విఫలమవుతాడు. మరో మ్యాచులో అద్భుతమైన బ్యాటింగ్తో అలరిస్తాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ గొప్ప ఇన్నింగ్స్లు ఆడాడు. సిడ్నీ టెస్టులో 96, బ్రిస్బేన్ టెస్టులో 89 పరుగులు చేశాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా ఫర్వాలేదు. కానీ, కాస్త సంయమనంతో వ్యవహరించాలి.
అతను ఎదుర్కొన్న మొదటి 10 బంతుల్లో పరుగులేమీ చేయకున్నా వచ్చే నష్టమేం లేదు. తర్వాతి నాలుగు బంతుల్లో 16 పరుగులు రాబట్టగల సత్తా అతని సొంతం. అందుకే, కోచ్ రాహుల్ ద్రవిడ్.. పంత్తో మాట్లాడాలి. అతనిలో ఉన్న టాలెంట్ గురించి వివరంగా చెప్పాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టు విజయానికి ఎంత కీలకమో వివరించాలి. 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తే చాలు. పంత్ కాస్త సంయమనంతో ఆడితే జట్టుకు ఎంతో మేలు చేకూరుతుంది' అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో రిషభ్ పంత్ షాట్ సెలెక్షన్పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. జొహన్నెస్ బర్గ్లో జరిగిన రెండో టెస్టులో, కేప్ టౌన్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో రిషభ్ పంత్ అత్యంత నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిరావడంతోనే భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అతని వికెట్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.