టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచకప్ ఆడలేరని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. కోహ్లీ, రోహిత్ల పనైపోయిందని అభిప్రాయపడ్డారు. కోహ్లీ, రోహిత్లకు వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని ఉన్నా ప్రాక్టీకల్గా ఇది సాధ్యం కాదని గవాస్కర్ చెప్పారు.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే వన్డే ఫార్మాట్లో కొనసాగుతామని చెప్పిన ఈ ఇద్దరూ.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే తమ లక్ష్యమని కూడా చెప్పారు. ఫ్యాన్స్ సైతం కోహ్లీ, రోహిత్.. వన్డే ప్రపంచకప్ 2027 గెలిచి.. సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని అభిప్రాయపడుతున్నారు.

రోహిత్, కోహ్లీ డౌట్..
ఈ క్రమంలోనే ఈ ఇద్దరి భవిష్యత్తు గురించి మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 2027 వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారా? అంటే అవునని చెప్పలేం. ఎందుకంటే అప్పటికీ ఈ ఇద్దరిలో ఇప్పటిలానే దూకుడుగా.. నిలకడగా ఆడే సత్తా ఉంటుందా? అని సెలెక్షన్ కమిటీ ఆలోచిస్తుంది.
వారిద్దరూ ఆడగలరని సెలెక్టర్లు భావిస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలుస్తారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్, కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడలేరు. కానీ ఇదే ఫామ్ను కొనసాగిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు చేస్తే ఆ దేవుడు కూడా జట్టు నుంచి ఈ ఇద్దర్నీ తప్పించలేరు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
గిల్ కాదు.. అతనే సరైనోడు!
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్కు కాకుండా జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా నియమిస్తే.. తన పనిభారం గురించి బాగా తెలుసుకోగలడు. అలా కాకుండా మరో ఆటగాడిని కెప్టెన్గా నియమిస్తే.. వారు బుమ్రా నుంచి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించవచ్చు. కానీ బుమ్రానే కెప్టెన్గా ఉంటే.. విశ్రాంతి కావాలన్నప్పుడు తీసుకుంటాడు.
బుమ్రాకు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతను ముందుండి జట్టును నడిపిస్తాడు. ఇతర ఆటగాళ్లపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్ల్లో బుమ్రా భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. బుమ్రా కెప్టెన్గా ఉంటేనే అతనికి గాయల బెడద ఉండదు.'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.