టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవాలంటే జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. వన్డే ఫార్మాట్లో సూపర్ ఫామ్ కనబర్చిన ఈ స్టార్ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో పునరాగమనం చేయాలని లిటిల్ మాస్టర్ సూచించాడు.
వన్డే ప్రపంచకప్లో కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడిన గవాస్కర్.. టీ20 ప్రపంచకప్లోనూ అదే స్థాయిలో సత్తా చాటగలడని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ సైతం సూపర్ ఫామ్లో ఉన్నాడని, ఈ ఇద్దరు జట్టులో ఉంటే టీమిండియాకు ప్రయోజనం చేకూరుతుందన్నాడు.

ఈ ఏడాది జూన్ 1 నుంచి 29 వరకు అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఐసీసీ శనివారమే ప్రకటించింది. భారత తమ తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుండగా 7న పాకిస్థాన్తో న్యూయార్క్ వేదికగా తలపడనుంది.
ఈ షెడ్యూల్ విడుదలైన క్రమంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ, రోహిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'గతేడాదిన్నరగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నారు. వన్డే ప్రపంచకప్లోనూ అద్భుతంగా ఆడారు. కాబట్టి ఈ ఇద్దరి టీ20 భవితవ్యం గురించి చర్చ అనవసరం.
ఇప్పటికీ ఈ ఇద్దరూ మైదానంలో చురుకుగా ఫీల్డింగ్ చేస్తున్నారు. చాలా మందిలో 35-36 ఏళ్ల వచ్చేసరికి చురుకుదనం లోపిస్తోంది. వీళ్లిద్దరు మాత్రం ఇందుకు మినహాయింపు. ఫీల్డ్లో పాదరసంలా కదులుతూ క్యాచ్లు అందుకోవడం చూస్తూనే ఉన్నాం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఒకే ఒక అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడనుంది.
అది కూడా జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్తో సొంతగడ్డపై ఆడనుంది. ఈ సిరీస్లో తలపడే టీమిండియా బీసీసీఐ మరో 24 గంటల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తారా? లేదా? అనేదానిపై సందేహం నెలకొంది. ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగానే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి అయితే హార్దిక్ పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్గా భావిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్లోనూ పాండ్యానే ఉన్నాడు.