ముంబై: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ చెలరేగి ఆడుతుంటే గల్లీ క్రికెట్ చూస్తున్నట్లే ఉందని అభిప్రాయపడ్డాడు. గత మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రెచ్చిపోయి ఆడిన సూర్య కుమార్ యాదవ్ కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.
అసాధారణ బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లను బాదిన సూర్య.. తనకే సాధ్యమైన సిక్సర్లతో అభిమానులను మురిపించాడు. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్.. సూర్య బ్యాటింగ్ను కొనియాడాడు. 'సూర్యకుమార్ యాదవ్ బౌలర్లతో ఆటాడుకుంటున్నాడు.
తన బ్యాటింగ్ చూస్తుంటే గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లే అనిపిస్తోంది.

ఎంతో ప్రాక్టీస్, శ్రమతో అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. తన కింది చేతిని అతను చక్కగా ఉపయోగిస్తాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అతను లాంగాన్, లాంగాఫ్ సహా అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడాడు. సూర్యలాంటి ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేస్తే మన ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతోంది. నెహాల్ వధేరా కూడా అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యలా అద్భుతమైన షాట్లు ఆడకపోయినా.. చాలా సమతూకంగా పరుగులు రాబట్టాడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
నెహాల్ వధేరాపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడని తెలిపాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్.. పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలవగా.. ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు చివరి మూడు మ్యాచ్ల్లో తప్పకుండా భారీ విజయాలు సాధించాలి. ఒక్కటి ఓడినా ఇంటిదారి పడుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 200 పరుగులు చేసి 21 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.