న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టు సెలెక్షన్కు ఐపీఎల్ను ప్రామాణికంగా తీసుకుంటున్నప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహించడం ఎందుకని ప్రశ్నించాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ టీమ్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ.. 16 మందితో కూడిన టెస్ట్, 17 మందితో ఉన్న వన్డే జట్లను ప్రకటించింది. వన్డేల్లో పెద్దగా మార్పులు చేయకున్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో టెస్ట్ టీమ్లోకి యువ ఆటగాళ్లను తీసుకుంది. చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్పై వేటు వేసి ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముఖేశ్ కుమార్లకు అవకాశం కల్పించింది.

అయితే ఈ సెలెక్షన్పై గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. గత రెండు సీజన్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ఖాన్ను తీసుకోకపోవడాన్ని సన్నీ తప్పుబట్టాడు. అలాగే పుజారాపై వేటు వేయడం కూడా సరికాదని, అతనికి భారీ సంఖ్యలో ఫాలోవర్లు లేకపోవడంతోనే జట్టు నుంచి తప్పించారని విమర్శించాడు.
'సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గత మూడు సీజన్లలో అతను 100 సగటుతో పరుగులు చేశాడు. అయినా అతనికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. టీమిండియాలోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి?.
తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని జట్టులోకి తీసుకుంటే.. రంజీల్లో ఆడుతున్న వారికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే జట్టులో చోటు ఇస్తున్నారు.
రెడ్ బాల్ క్రికెట్కు కూడా ఐపీఎల్ ఆటే కొలమానం అయితే రంజీ ట్రోఫీ నిర్వహించడం ఎందుకు? దాన్ని ఆపేయండి. రంజీల్లో ఏ ప్లేయర్ కూడా ఆడకండి. ఫలితం లేనప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీకి అంత ఖర్చు పెట్టి దండగే. యువ ఆటగాళ్లకు ఇదే విషయాన్ని చెప్పండి. ఐపీఎల్ రాణిస్తే రెడ్ బాల్ క్రికెట్ ఆడవచ్చని తెలపండి'అని గవాస్కర్ సెటైరికల్గా కామెంట్ చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని పుజారాను ఒక్కడితే బాధ్యుడిని చేయడం సరికాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత టెస్ట్ క్రికెట్కు అతను ఎంతో చేశాడని, వ్యక్తిగతంగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్నాడని, కానీ అతనికి మిలియన్ల ఫాలోవర్స్ లేరని తెలిపాడు. జట్టు నుంచి తప్పించినప్పుడల్లా గోల చేసే అభిమానులు లేకపోవడంతోనే పుజారాను తప్పించారని విమర్శించాడు.