సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ.. టెస్ట్ మ్యాచ్లకు అనుగుణంగా తన మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించాడు. వన్డే ఫార్మాట్లో మాదిరి దూకుడుగా ఆడకుండా ఓపికగా బ్యాటింగ్ చేయాలన్నాడు.
దానికోసం కాస్త ఉరుకులాటను ఆపుకోవాలని, టెంప్టింగ్ బాల్స్ను వదిలేయాలని గవాస్కర్ సలహా ఇచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా సఫారీ గడ్డపై జరగనున్న రెండు టెస్ట్ల సిరీస్లో విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మంగళవారం సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో గవాస్కర్ ఓ ఛానెల్తో మాట్లాడాడు. ఈ సిరీస్ రోహిత్ శర్మకు కీలకం కానుందని చెప్పాడు. కెప్టెన్గా, బ్యాటర్గా రాణించి భారత్ను విజేతగా నిలిపితే అతని పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డాడు. విఫలమైతే మాత్రం అతని భవితవ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించాడు.
'రోహిత్ శర్మ ముందుగా తన మైండ్సెట్ను టెస్ట్ మ్యాచ్లకు అనుగుణంగా మార్చుకోవాలి. అతను వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడినట్లు టెస్ట్ల్లో ఆడుతానంటే కుదరదు. వన్డే ప్రపంచకప్లో దూకుడుగా ఆడిన రోహిత్.. పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ స్కోర్ చేయాలని ప్రయత్నించాడు. సక్సెస్ కూడా అయ్యాడు. కానీ టెస్ట్ క్రికెట్లో ఈ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి.
ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్లో రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. రోహిత్ కూడా ఆ కోణంలోనే ఆలోచించి.. ఎక్కువ సేపు క్రీజులో నిలబడే ప్రయత్నం చేయాలి. రోహిత్ రోజంతా బ్యాటింగ్ చేస్తే సునాయసంగా 150 పరుగులు చేస్తాడు. అదే జరిగితే టీమిండియా స్కోర్ 300-350 ధాటుతోంది.'అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఇరు జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ జరిగే సెంచూరియన్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సెంచూరియన్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.