ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడం కీలకమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఫామ్లో ఉంటేనే కెప్టెన్గా ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పాడు. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెరలేవనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే తొలి మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.
ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చారు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ విధ్వంసకర శతకం సాధించగా.. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. అతను అత్యంత అరుదైన బ్యాటర్ అని ఓ జాతీయ దినపత్రికకు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు.

'వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ అత్యంత విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవాలంటే రోహిత్ ఫామ్లో ఉండటం అత్యంత కీలకం. ఈ ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన మరో బ్యాటర్ లేడు. రోహిత్ శర్మనే ఈ అత్యంత అరుదైన రికార్డ్ అందుకున్నాడు. కెప్టెన్గా ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అతను ఫామ్లో ఉండటం కీలకం.
విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్. దేశం తరఫున పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీ అందించాలనే విషయం కంటే ఏది అతనికి ప్రేరణగా నిలవదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం విరాట్ కోహ్లీ గంగ్నమ్ డ్యాన్స్తో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ సారి అతను భారత విజయంలో భాగమైతే.. అతని నుంచి మేం మరో ప్రత్యేకమైన సెలెబ్రేషన్ను చూడవచ్చు.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.