టీమిండియా టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి జస్ప్రీత్ బుమ్రాను సారథిగా ఎంపిక చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి టెస్ట్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదనే వార్తల నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
వ్యక్తిగత పనుల నేపథ్యంలో రోహిత్ శర్మ తొలి రెండు టెస్ట్లకు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ బీసీసీఐ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. తన భార్య రితికా సజ్డే రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని, ఈ కీలక సమయంలో ఆమె పక్కన ఉండేందుకే రోహిత్.. ఆసీస్తో తొలి రెండు టెస్ట్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రోహిత్ శర్మ గైర్హాజరీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు బీసీసీఐ కానీ.. ఇటు రోహిత్ శర్మ కానీ ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. రోహిత్ శర్మ గైర్హాజరీ వార్తలపై స్పందించిన సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్లో రోహిత్ శర్మ ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్లకు దూరమైతే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా కొనసాగించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలని, రోహిత్ శర్మ తిరిగొచ్చినా.. ఆటగాడిగానే కొనసాగించాలన్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీపై టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ తొలి మ్యాచ్ ఆడటం చాలా కీలకమని కూడా గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఓ జాతీయా ఛానెల్తో మాట్లాడుతూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడడం కెప్టెన్కు చాలా ముఖ్యం. గాయంతో జట్టుకు దూరమైతే వేరు. కెప్టెన్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు. తొలి రెండు టెస్ట్లు రోహిత్ శర్మ ఆడకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా నియమించాలి.
రోహిత్ శర్మ తిరిగొచ్చినా ఆటగాడిగానే కొనసాగాలని భారత సెలెక్టర్లు అతనికి చెప్పాలి. లేదంటే తొలి టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ తప్పనిసరిగా ఆడాలి.
గతంలో విరాట్ కోహ్లీ కూడా ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. కానీ అతను తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత సిరీస్ మొత్తం రహానేనే సారథిగా కొనసాగాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం నేపథ్యంలో ఆసీస్ పర్యటనలో కెప్టెన్ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. ఆసీస్పై సిరీస్ విజయం భారీ క్రికెట్కు చాలా ముఖ్యం'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం కానుండగా.. బుమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ అటు కెప్టెన్గా.. ఇటు ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్ల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం.
మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆసీస్ గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవద్దు. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజా కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.