న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీకి అంతగా గుర్తింపు దక్కడం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నాడు. మైదానంలో ఏం జరిగినా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రెడిట్ ఇస్తారని, కానీ రోహిత్ను మాత్రం అలా చూడటం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇండియా టుడేతో మాట్లాడిన సునీల్ గవాస్కర్ రోహిత్-ధోనీ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్లో రోహిత్ శర్మ ముంబై సారథిగా ఐదు టైటిళ్లు గెలిచినా.. అతని కెప్టెన్సీకి తగిన గుర్తింపు దక్కడం లేదు. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచే పెద్ద ఉదాహరణ. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసి ఆయుష్ బదోనిని ఔట్ చేశాడు.

లెఫ్టాండర్ నికోలస్ పూరన్ రాగానే రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు. చాలా మంది బౌలర్లు ఇలా తమ బౌలింగ్ ఎండ్ను మార్చరు. ఓవర్ వికెట్ రిథమ్ దొరికితే లెఫ్టాండర్ బ్యాటింగ్ వచ్చినా అదే ఎండ్లో బౌలింగ్ను కొనసాగిస్తారు. లెఫ్టాండర్కు ఆఫ్ ద వికెట్కు దూరంగా వెళ్లేలా బంతులు వేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మధ్వాల్ రోహిత్ సూచనలతో తన ఎండ్ను మార్చుకొని వికెట్ తీసాడు.
ఇదే ధోనీ కెప్టెన్సీలో జరిగితే ప్రతి ఒక్కరూ పూరన్ను ధోనీనే ఔట్ చేశాడని మాట్లాడుకునేవారు. హైప్ క్రియేట్ చేసేవారు. రోహిత్ శర్మ తన బౌలర్లను తెలివిగా ఉపయోగించుకుంటున్నా.. ధోనీలా అతనికి క్రెడిట్ ఇవ్వడం లేదు. రోహిత్ శర్మ కూడా ఈ క్రెడిట్ తనేదనని చెప్పదల్చుకోలేదు. ఐదు వికెట్లు తీసిన మధ్వాల్కే గుర్తింపు దక్కాలనుకున్నాడు.
నెహాల్ వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవడం కూడా రోహిత్ కెప్టెన్సీ ఘనతే. సహజంగా ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోరు. కానీ రోహిత్ వ్యూహాత్మకంగా అతన్ని బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోను 81 పరుగులతో చిత్తుగా ఓడించిన ముంబై.. నేడు గుజరాత్ టైటాన్స్తో జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.