టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అతని బ్యాటింగ్ టెక్నిక్ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించాడు. ఈ సమస్యను అధిగమించకుండా దేశవాళీ క్రికెట్లో ఎన్ని శతకాలు చేసినా వృథానేనని తెలిపాడు.
గాయంతో గత 6 నెలలుగా ఆటకు దూరమైన పృథ్వీ షా.. పూర్తి ఫిట్నెస్ సాధించిన అనంతరం ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్ రంజీ ట్రోఫీ 2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. రీఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్లోనే మెరుపు శతకం బాదాడు. ఛత్తీస్గఢ్తో మ్యాచ్లో 185 బంతులు ఆడి 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. మరోసారి తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు.

ఈ మ్యాచ్ తొలి రోజు ఫస్ట్ సెషన్లోనే 107 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీ షా.. రంజీ ట్రోఫీ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్ ఆటలో రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ భారీ ఇన్నింగ్స్ నేపథ్యంలో పృథ్వీ షాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.
పృథ్వీ షా రీఎంట్రీపై స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పృథ్వీ షా సత్తా చాటే సమయం ఆసన్నమైంది. అయితే చాలా జట్లకు పృథ్వీ షా బలహీనత ఏంటో తెలిసిపోయింది. ముఖ్యంగా అతని ఫ్రంట్ ఫూట్ కదలిక, హై బ్యాక్ లిఫ్ట్తో అతను షాట్ ఆడే ప్రయత్నం చేయడం సమస్యగా మారింది.
కాబట్టి బ్యాక్ఫుట్లో ఆడటం నేర్చుకోకపోతే అతను భవిష్యత్తు చాలా ఇబ్బందులు పడుతాడు. బంతి పైకి రాని పిచ్లపై మాత్రం అతను చెలరేగుతున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే పృథ్వీ షా బ్యాటింగ్ లోపాన్ని సరిదిద్దుకోవాలి.'అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు ఈ ఇన్నింగ్స్పై పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై తాను ఆశలు వదులుకున్నానని తెలిపాడు. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంలో ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. 'భవిష్యత్తు గురించి నేను ఆలోచించడం లేదు. ప్రస్తుత కాలంలో ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా.
టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆశ కూడా లేదు. మళ్లీ ఆడటం మొదలుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఫీలవుతున్నా. ఇప్పుడే గాయం నుంచి కోలుకొని బ్యాట్ పట్టాను. నా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా లక్ష్యం ముంబై తరఫున రంజీ ట్రోఫీ గెలవడమే. ఈ టైటిల్ గెలిచేందుకు నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.