న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు అవకాశం కల్పించడాన్ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. నొప్పులతో రాహుల్ ఇబ్బంది పడుతున్నా.. అతన్ని జట్టులోకి తీసుకొని కోలుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు.
టీమిండియాకు అతను కీలకం కానున్నాడని చెప్పాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. తెలుగు తేజం తిలక్ వర్మ ఈ జట్టులో చోటు దక్కించుకోగా.. గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు.

ఐర్లాండ్ పర్యటనలో పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు కూడా ఆసియాకప్కు ఎంపికయ్యారు. వన్డేల్లో మెరుగైన రికార్డులేని సూర్య కుమార్ యాదవ్కు కూడా చోటు దక్కింది. ఆశ్చర్యకరంగా యుజ్వేంద్ర చాహల్పై వేటు వేసిన సెలెక్టర్లు అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు చోటిచ్చారు.
గాయం నుంచి కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకొన్నాడని, కానీ సైడ్లైన్ నిగిల్తో బాధపడుతున్నాడని, తొలి మ్యాచ్లోపు పూర్తిగా కోలుకుంటాడని అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. రాహుల్ నొప్పులతో బాధపడుతున్నాడని చెప్పడంతో సెప్టెంబర్ 2న పాకిస్థాన్తో జరిగే మ్యాచ్కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. ఇక ఆసియాకప్ జట్టుపై మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి రాహుల్ పూర్తిగా కోలుకుంటాడు. భారత్ మ్యాచ్కు ఇంకా 11 రోజుల సమయం ఉంది. అతను కోలుకోవడానికి ఇది సరిపోతుంది. రాహుల్ను ఎంపిక చేసి మంచి పని చేశారు. గతంలో భారత్ తరఫున అతను ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు.
రాహుల్ ఎలాంటి క్లాస్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కొన్ని మ్యాచ్లు ఆడించి అతని ఫిట్నెస్ను పరిశీలించాలి. అతను పూర్తిగా కోలుకోకుంటే ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవాల్సి వచ్చేది. కానీ అతను పూర్తిగా కోలుకున్నాడు. కాబట్టి కాస్త సమయం ఇవ్వడమే న్యాయం. అనంతరం భారత్ తరఫున అతను గొప్ప ఇన్నింగ్స్లు ఆడుతాడు.'అని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశాడు.
మిడిలార్డర్లో కేఎల్ రాహుల్కు మెరుగైన రికార్డు ఉంది. వన్డేల్లో 54 మ్యాచ్లు ఆడిన రాహుల్ 5 సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఏడాది 6 మ్యాచ్ల్లో 56.50 సగటుతో 226 పరుగులు చేశాడు.