టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ రెడ్డి ఎంతో నయమని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా కెరీర్ ఆరంభంలో ఆడిన దానికంటే నితీష్ కుమార్ రెడ్డి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని కితాబిచ్చాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత శతకం సాధించాడు. తొలి ఆసీస్ పర్యటనలోనే అసాధారణ బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ శతకం నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిని గవాస్కర్ కొనియాడాడు.

'మెల్బోర్న్ టెస్ట్ భారత క్రికెట్లో ఓ అసాధారణ ఆటగాడిని వెలుగులోకి తెచ్చింది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున మెరుగైన ప్రదర్శన చేసి నితీష్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డ్ లేకున్నా.. అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఈ తెలుగు కుర్రాడిని టెస్ట్లకు ఎంపిక చేసింది.
ఇందుకు భారత సెలెక్టర్లను అభినందించాలి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనే అతనిలో పట్టుదల కనిపించింది. పరిస్థితులకు తగ్గట్లు రాణించే సత్తా ఉందని అర్థమైంది. ఆ తర్వాత అంచనాలకు తగ్గట్లు ముందుకు సాగాడు. కెరీర్ ఆరంభంలో హార్దిక్ పాండ్యా ఆడిన దానికంటే నితీష్ రెడ్డి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. హార్దిక్ బ్యాకప్ ప్లేయర్ కోసం టీమిండియా ఎన్నో ఏళ్లు అన్వేషిస్తోంది. ఆ అవకాశాన్ని నితీష్ అందిపుచ్చుకున్నాడు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మెల్బోర్న్ టెస్ట్లో నితీష్ అద్భుత శతకంతో టీమిండియాను ఆదుకున్నా ఓటమి తప్పలేదు. 184 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. కనీసం ఓటమి నుంచి గట్టెక్కే అవకాశం ఉన్నా టీమిండియా ఉపయోగించుకోలేకపోయింది. మరో 10 ఓవర్లు ఆడి ఉంటే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేది. ఈ ఓటమితో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్ట్ శుక్రవారం(జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది.