
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 ప్రపంచకప్ వాయిదా వేస్తేనే ఐపీఎల్ 2020 నిర్వహణ సాధ్యమవుతుందని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తెలిపాడు. కరోనా కారణంగా వాయిదా పడిన మెగాలీగ్ నిర్వహణ ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నాడు. సలాం ఇండియా కార్యక్రమంలో గావస్కర్ మాట్లాడుతూ ఐసీసీ టీ20 ప్రపంచకప్ను వాయిదా వేస్తే సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో ఐపీఎల్ 13వ సీజన్ని నిర్వహించొచ్చని అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ బీసీసీఐకి అప్పుడు ఐపీఎల్ నిర్వహించే అవకాశం వచ్చినా భారత్లో నిర్వహించడం కష్టమని చెప్పాడు. భారత్లో అది వర్షాకాలమని గుర్తుచేశాడు. అయితే, ఈ మెగా టోర్నీని శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ సమాలోచనలు చేసే అవకాశం ఉందన్నాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఆంక్షలు, భద్రతా పరమైన అంశాల నేపథ్యంలో ఐపీఎల్ను కుదించి నిర్వహించడం మంచిదని సూచించాడు.
'సెప్టెంబరులో భారత్లో నిరంతరంగా వర్షాలు పడుతుంటాయి. కాబట్టి ఆ నెలలో ఐపీఎల్ని నిర్వహించడం సాధ్యంకాదు. అయితే శ్రీలంకలో ఆ టోర్నీని నిర్వహించొచ్చు. కానీ.. ఒక నెల టైమ్లో మునుపటి తరహాలో 56 లీగ్ మ్యాచ్లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్లను జరపడం అంత సులువు కాదు. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. అంటే సగం మ్యాచ్లు.. అంతేతప్ప మునుపటిలా డబుల్ హెడర్స్కి టైమ్ సరిపోదు'' అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.
ఇక టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో ఐసీసీ వెనక్కు తగ్గకపోతే ఐపీఎల్ నిర్వహణ చాలా కష్టమని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే ఆ దేశ ప్రధాని 25 శాతం అభిమానులతో మైదానాలు తెరుచుకోవచ్చని చెప్పడంతో టీ20 ప్రపంచకప్ నిర్వహణ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే ప్రస్తుత కరోనా నిబంధనల నేపథ్యంలో ఆయా జట్లు ఆటగాళ్లు, సిబ్బంది 15 రోజుల ముందే అక్కడికి చేరుకోని సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో సెప్టెంబర్లో నిర్వహించాలనుకుంటున్న ఐపీఎల్కు కష్టమవుతుందని గావస్కర్ తెలిపాడు.