
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా జట్టులో వికెట్లు తీసే బౌలర్లు లేరని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్ తప్పా మరెవరూ వికెట్లు తీయలేకపోతున్నారని, దాంతోనే వరుస మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైందని తెలిపాడు.
కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంపై అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గవాస్కర్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
'ఈ టీమిండియా జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్పితే మరో వికెట్ టేకింగ్ బౌలర్ లేడు. అదే ఈ సిరీస్లో అతిపెద్ద సమస్య. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు. అందుకే తొలి టీ20లో 211 పరుగుల భారీ స్కోర్ సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. రెండో మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీసినా.. స్పల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
కాగా చాలా నెమ్మదిగా ఉన్న కటక్ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34), శ్రేయస్ అయ్యర్ (40), దినేశ్ కార్తీక్ (30) ఆ మాత్రం పరుగులు చేయడంతో.. భారత్ మోస్తరు స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. డికాక్ స్థానంలో ఈ మ్యాచ్లో ఆడిన క్లాసెన్ (81) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో భువి 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.