
న్యూఢిల్లీ: టీమిండియా హిట్టర్స్ హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్లను ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు పంపిస్తే పరుగుల విధ్వంసం సృష్టిస్తారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఈ ఇద్దరి ఆటగాళ్లను ఫినిషర్స్ రోల్స్లో పరీక్షించాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు గవాస్కర్ సూచించాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచ కప్ ముందు జరిగే సౌతాఫ్రికా సిరీస్పైనే పడింది. టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకమైనది. సీనియర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ కేఎల్ రాహుల్ సారథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు యువ క్రికెటర్లతో జట్టును ఎంపిక చేసింది. జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు దాదాపు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2022లో అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్కి టైటిల్ అందించాడు. దాంతో ఐపీఎల్ కొనసాగుతున్న సమయంలోనే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం హార్దిక్కు పిలుపు వచ్చింది. కేఎల్ రాహుల్ కెప్టెన్గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా ఉన్న ఈ జట్టులో హార్దిక్ ఆల్రౌండర్గా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్లో పంత్, హార్దిక్ను ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్కి పంపిస్తే ఆఖరి ఆరు ఓవర్లలో 120 పరుగులు రావొచ్చంటూ గవాస్కర్ జోస్యం చెప్పాడు.
'హార్దిక్ పాండ్యాను ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తారని అనుకుంటున్నా. ఐదు, ఆరు స్థానాల్లో రిషభ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ల కాంబినేషన్లో టీమిండియా ఆఖరి ఆరు ఓవర్లలో భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. ఈ ఆరు ఓవర్లలో ఈ ఇద్దరూ 100 నుంచి 120 పరుగులను ఆశించొచ్చు. వాళ్లకి ఆ సత్తా కూడా ఉంది. అలాంటి ఆట చూడాలని నాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.