
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించాల్సిందేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. నాకౌట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా రోహిత్కు ప్రయోగాలు చేసే ఆస్కారం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో దుమ్మురేపిన టీమిండియా గ్రూప్2 టాపర్గా సగర్వంగా సెమీస్లోకి దూసుకెళ్లింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్లతో విజయాల్లో భాగస్వామిగా మారుతున్నాడు. కేఎల్ రాహుల్ కూడా తన ఫామ్ను అందుకున్నాడు. అయితే ఈ టోర్నీలో సారథి రోహిత్ శర్మ మాత్రం పేలవ ప్రదర్శనతో చతికిలపడ్డాడు.
పసికూన నెదర్లాండ్స్పై అర్థ శతకం మినహా.. ఏ మ్యాచ్లోనూ రోహిత్ రాణించింది లేదు. పాక్పై 4, సౌతాఫ్రికాపై 15, బంగ్లాపై 2, జింబాబ్వేపై 15 పరుగులు మాత్రమే చేసాడు. ఈ క్రమంలోనే రోహిత్ ఫామ్పై స్పందించిన సునీల్ గవాస్కర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ పేలవ ప్రదర్శనతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతోందని.. ప్రస్తుతం నాకౌట్కు చేరిన దశలో అతడి ఫామ్ టీమిండియాకు కీలకమని అభిప్రాయపడ్డాడు.
'తర్వాతి రెండు మ్యాచ్ల కోసం రోహిత్ శర్మ తన పరుగుల్ని సేవ్ చేశాడని ఆశిద్దాం. సెమీస్లో ఆడేవి పెద్ద మ్యాచ్లు. గ్రూప్ దశలో ఓ మ్యాచ్ ఓడిపోతే.. ఇంకో మ్యాచ్ ఉంటుంది. కాబట్టి.. కొన్నిసార్లు ఎక్కువ ప్రయోగాలు చేసి ఫలితం సాధించవచ్చు. అయితే నాకౌట్ మ్యాచ్ల్లో అలా ఎక్కువ ప్రయోగాలు చేయలేం. ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా ఆడాలి. రోహిత్ గొప్పగా తిరిగి వస్తాడని ఆశిద్దాం'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక అతి దూకుడుగా ఉండే స్వభావం రోహిత్కు ఆటలో ఏ మాత్రం మేలు చేయదని పేర్కొన్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకోవాలని సూచించాడు.
ఇక 2007లో తొలి టీ20 ప్రపంచకప్ను నెగ్గిన భారత జట్టులో ఉండి.. ప్రస్తుతం టీమ్లో కొనసాగుతున్న ఆటగాళ్లుగా రోహిత్, దినేశ్ కార్తీక్లు ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి ఆడుతుండటంతో భారత్ టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గురువారం అడిలైడ్ వేదికగా జరిగే సెమీఫైనల్-2లో భారత్ ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.