న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం తనకు ఎమోషనల్ మూమెంటని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నైలోని చెపాక్ వేదికగా చివరి లీగ్ మ్యాచ్ ఆడేసిన చెన్నై.. మ్యాచ్ అనంతరం పరేడ్ నిర్వహించి అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
ధోనీ టెన్నిస్ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ మైదానంలోకి వచ్చి తన షర్ట్పై మహీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. ఆ సమయంలో స్టేడియంలో ఏం జరుగుతుందో తనకు ముందుగా తెలియలేదని.. అప్పుడు తాను సిద్ధంగా కూడా లేనని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

'చెపాక్ స్టేడియంలో ధోనీతో కలిసి ఆటగాళ్లంతా కలియతిరిగి అభిమానులకు అభివాదం చేస్తారన్న విషయం నాకు తెలియదు. ఆ విషయం తెలియగానే.. వెంటనే ఓ పెన్ను ఇతరుల వద్ద తీసుకొని ధోనీ వద్దకు పరుగెత్తాను. ధోనీని ప్రేమించకుండా ఎవరూ ఉండరు. భారత క్రికెట్ కోసం అతను ఎంతో చేశాడు. అది అద్భుతం.
అతడు ఎలాంటి రోల్మోడల్గా నిలిచాడనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. భారత్లో ఎంతో మంది యువకులు ఉన్నారు. వారందరికీ మహీ స్ఫూర్తిగా నిలుస్తాడు. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం నాకు ఏమోషనల్ మూమెంట్' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ధోనీకిదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు అతని ఆటను వీక్షించేందుకు స్టేడియానికి తరలివచ్చారు. ఇక ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన చెన్నై 15 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ వేదికగా మే 20న చెన్నై చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్తో పాటు క్వాలిఫయర్-1 మ్యాచ్కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.