
మొహాలీ: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం చెత్త బౌలింగేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. బౌలర్లు దారుణంగా విఫలమవడంతోనే టీమిండియా 208 పరుగుల భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో మంచు ప్రభావం కూడా లేదని, ఏ ఒక్క ఫీల్డర్ కూడా టవల్తో కనిపించలేదని తెలిపాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు సొంతగడ్డపై టీమిండియా ఓటమిపాలవ్వడం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా వైఫల్యం స్పందించిన గవాస్కర్.. భువీ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశాడు. 'ఈ మ్యాచ్ లో మంచు ప్రభావం ఉన్నట్టు కూడా నాకు కనిపించలేదు. ఫీల్డర్లు, బౌలర్లు బంతిని టవల్ తో తుడిచిన సందర్బాలు కూడా నేను చూడలేదు. మంచు పేరు చెప్పి ఈ ఓటమి నుంచి తప్పించుకోవడానికి లేదు. మన బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అదే ఓటమికి ప్రధాన కారణం. ముఖ్యంగా 19వ ఓవర్లో భారత్ దారుణంగా విఫలమైంది. ఆ ఓవర్ వేసిన భువీ.. 16 పరుగులిచ్చాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు. గత మూడు మ్యాచ్ల్లో కూడా డెత్ ఓవర్లలో భువీ బౌలింగ్ ఆందోళనకరంగా ఉంది .
19వ ఓవర్లో భాగంగా బౌలింగ్ చేస్తూ భువీ గత 18 బంతుల్లో (పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాపై) 49 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ప్రతి బంతికి దాదాపు మూడు పరుగుల దాకా ఇచ్చినట్టే. ఇది కచ్చితంగా ఆందోళనకరమైన విషయమే. భువనేశ్వర్ అనుభవం కలిగిన బౌలర్. అటువంటి ప్లేయర్ ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టాలి గానీ అతనే ఇలా బౌలింగ్ చేస్తే ఎలా..?'అని గవాస్కర్ ప్రశ్నించాడు.
ఇక హర్షల్ పటేల్ పై స్పందిస్తూ.. అతను గాయం నుంచి కోలుకుని ఇప్పుడే మ్యాచ్ ఆడాడని.. కుదురుకోవడానికి సమయం పడుతుందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భాగంగా భువనేశ్వర్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. అతను వేసిన చివరి రెండు ఓవర్లలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వీరవిహారం చేసి మ్యాచ్ను కంగారూల వైపునకు మళ్లించాడు. ఇక హర్షల్ పటేల్.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు.