
న్యూఢిల్లీ: భారత పిచ్ల గురించి అదే పనిగా మాట్లాడుతూ విమర్శలు గుప్పించడం ఆస్ట్రేలియా మైండ్ గేమ్ అని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత పిచ్ల గురించి ఆస్ట్రేలియా మీడియా, ఆ దేశ మాజీ క్రికెటర్లు చేసే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవద్దని భారత ఆటగాళ్లకు సూచించాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో ప్రమాదకరమైన బ్రిస్బేన్ పిచ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎదురు ప్రశ్నించాడు. ఆ పిచ్పై ఆడుతున్నప్పుడు ఇరు జట్ల బ్యాటర్ల గుండెలు నోట్లోకి వచ్చాయన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్కు ఉపయోగించే పిచ్ను భారత్ తమకు అనుకూలంగా తయారు చేసుకుందని ఆసీస్ మాజీ క్రికెటర్లు, మీడియా విమర్శలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణలపై గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. 'పిచ్ల గురించి అదే పనిగా మాట్లాడడం ఆసీస్ వ్యూహంలో భాగం. బ్రిస్బేన్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. మరి ఆ మ్యాచ్కు సిద్ధం చేసిన పిచ్ సంగతేంటి? అలాంటి పిచ్పై ఆడడం ఆటగాళ్ల ప్రాణాలకే ప్రమాదం.
స్పిన్ పిచ్ల వల్ల పోయేది ప్రాణాలు కాదు, ఆటగాళ్ల పేరు మాత్రమే. బ్రిస్బేన్ పిచ్పై ఆడుతున్నపుడు ఇరు జట్ల బ్యాటర్ల గుండెలు నోట్లోకి వచ్చేశాయి. క్రికెట్ బ్యాట్స్మన్ ఆటగా మారిపోయిందని, కాబట్టి బౌలర్లకూ అవకాశం ఇవ్వాలని ఆసీస్ మీడియా ఇలాంటపుడు సాకులు వెతకడం మామూలే. కానీ భారత్కు వచ్చేసరికి తొలి రోజే బంతి తిరగడం గురించి అభ్యంతరాలు మొదలవుతాయి.
టెస్టు మ్యాచ్లో స్పిన్ ఆడడమే ఒక బ్యాటర్కు ఉత్తమ సవాలు. టర్న్ అయ్యే బంతులు బ్యాటర్ ఫుట్వర్క్ను పరీక్షిస్తాయి. అందుకే ఉపఖండంలో ఎక్కువ సెంచరీలు సాధించే ఆటగాడిని ఉత్తమ బ్యాటర్గా పరిగణిస్తారు. గత పర్యటనలో స్టీవ్ స్మిత్ పుణెలో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటనదగ్గ సెంచరీ సాధించాడు. ఈసారి అతను స్పిన్నర్లను ఎలా ఆడతాడో చూడాలి. మొత్తంగా భారత్-ఆస్ట్రేలియా సిరీస్పై క్రికెట్ ప్రపంచం అమితాసక్తితో ఉందన్నది మాత్రం వాస్తవం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.