
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్లో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. మూడో వికెట్కు 111 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన గవాస్కర్.. పుజారా-రహానే బ్యాటింగ్ను కొనియాడారు. మరీ దారుణంగా విఫలమయ్యే వరకు ఈ ఇద్దరికి టీమ్ ఇలానే అండగా ఉంటూ నమ్మకం ఉంచాలని అభిప్రాయపడ్డాడు.
'పుజారా, రహానే ఇద్దరికీ ఉన్న అనుభవం, గతంలో జట్టుకు అందించిన విజయాల నేపథ్యంలోనే టీమ్మేనేజ్మెంట్ వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించింది. అవసరమైన వేళ వారిద్దరూ రాణిస్తారనే నమ్మకం ఉంచింది. అందుకు తగ్గట్టే రెండో ఇన్నింగ్స్లో రాణించి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కొన్నిసార్లు మనం సీనియర్ల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే రిజర్వ్బెంచ్లో పలువురు నైపుణ్యమున్న యువకులు తమ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఎలా ఆడతారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ సీనియర్లు ఇద్దరూ మరీ ఘోరంగా విఫలమవ్వనంతకాలం.. జట్టు అండగా ఉంటూ ఇలాగే నమ్మకం ఉంచాలని నేను అనుకుంటున్నా' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయం.. టీమిండియాకు చిక్కినట్లే చిక్కి చేజారింది. జోహన్నెస్బర్గ్ వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన సఫారీ టీమ్ 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), టెంబా బవుమా (23 నాటౌట్) అతనికి అండగా నిలిచారు. ఇక భారత బౌలర్లలో శార్దూల్, అశ్విన్, షమీ తలో వికెట్ తీయగా.. సిరాజ్, బుమ్రా దారుణంగా విఫలమయ్యారు. కీలక క్యాచ్లు నేలపాలు చేయడం కూడా భారత్ను దెబ్బతీసింది.