ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనదైన వ్యాఖ్యలతో ట్రోల్ చేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లోనూ హ్యారీ బ్రూక్(13) దారుణంగా విఫలమయ్యాడు. మరోసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లోనూ హ్యారీ బ్రూక్.. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లోనే బౌల్డ్ అయిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ వైఫల్యానికి పొగ మంచే కారణమని హ్యారీ బ్రూక్ తెలిపాడు.

పొగ మంచు వల్లే విఫలమయ్యాం..
రెండో టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన హ్యారీ బ్రూక్.. కోల్కతాలోని పొగమంచు కారణంగా భారత బౌలర్ల లైన్, లెంగ్త్లను సమర్థవంతంగా అంచనా వేయలేకపోయామని చెప్పాడు.'వరుణ్ చక్రవర్తి బంతులను అంచనా వేయడం చాలా కష్టం. దట్టమైన పొగమంచు పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. చెన్నైలో రెండో మ్యాచ్లో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాం," అని బ్రూక్ పేర్కొన్నాడు.
ఇక్కడ పొగమంచు లేదు కదా..?
రెండో టీ20లోనూ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లోనే హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. అతను ఔటైన వెంటనే 'ఇక్కడ స్పష్టమైన వెలుతురు ఉంది. ఎలాంటి పొగమంచు లేదు.'అని సెటైర్లు పేల్చాడు. వరుణ్ చక్రవర్తీ ఔటైన విషయాన్ని మరో కామెంటేటర్ రవిశాస్త్రి తెలియజేశాడు. 'మరోసారి.. వరుణ్ చక్రవర్తీనే ఔట్ చేశాడు. మీకు పొగ మంచు అవసరం లేదు. కనబడకుండా బంతి దూసుకెళ్లి వికెట్లను పడేసింది.'అని రవిశాస్త్రి తనదైన శైలిలో కామెంట్రీ చెప్పాడు.
వరుణ్ చక్రవర్తీ అడుగుతాడేమో..
వెంటనే సునీల్ గవాస్కర్'ఏం చెప్పారు.. ఏం చెప్పారు. చెన్నైలో ఇక్కడ స్పష్టమైన వెలుతురు ఉంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో పొగ మంచు ఉంది. కానీ ఇక్కడ లేదు. బంతి బ్యాటర్ అంచనాను ధాటి వెళ్లి ఆఫ్ స్టంప్ను తాకేసింది. హ్యారీ బ్రూక్ 13 పరుగులకే వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తీ.. హ్యారీ బ్రూక్నే చూస్తూ ఉన్నాడు. బహుషా ఇక్కడ ఏమైనా పొగ ఉందా? అని అడగాలనుకుంటున్నాడేమో'అని గవాస్కర్ చమత్కరించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. మరోసారి కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 45) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీగాయ.. అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ దక్కింది.